యాదగిరిగుట్ట, ఫిబ్రవరి16 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లో అరుణపారాయణాలు పఠిస్తూ సేవను ఊరేగించారు. తూర్పు రాజగోపురం వద్ద సేవను వేంచేపు చేసి స్వామివారి వైభనం, పుట్టు పుర్వోత్తరాలు, అలయ చరిత్రను ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు వివరించారు.
సాయంత్రం స్వర్ణరథంపై స్వామివారిని వేంచేపు చేసి సేవను కొనసాగించారు. సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుడి వాహనాన్ని స్వామివారు అధిరోహించి భక్తులకు కటాక్షించారు. సూర్య జయంతిని పురస్కరించుకొని స్వామివారు ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుమాఢ వీధుల్లోకి చేరుకుని స్వామివారికి మంగళహారతులు పలికారు.
తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శనబాగ్యం కల్పించారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఘనంగా సాగింది. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు రెండోరోజు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారి నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బాజాభజంత్రీలతో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు.
సాయంత్రం నిత్యారాధనల అనంతరం దివ్య ప్రబంధాన్ని పారాయణికులు పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బాల భాస్కర్ శర్మ, ఆలయ అధికారులు రమేశ్బాబు, శ్రవణ్కుమార్, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.