యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 16 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఆలయంలో వేదమూర్తులైన బ్రహ్మాణోత్తములతో ధ్వజపటారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం నిత్యహవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణాలు, పంచసూక్తపఠనం, మూలమంత్ర జపములు, వివిధ పారాయణాలు గావించారు. డోలు వాయిద్యానికి పూజాధికారాలు చేసి నాద స్వరాలపై ఆయా దేవతలను ఆహ్వానించారు. ఉత్సవాలకు వేంచేసిన సకల దేవతలకు అగ్ని ముఖంగా హవిస్సులు అందజేయుటకు అగ్నిప్రతిష్ఠ మహోత్సవం చేపట్టారు.
అగ్ని ప్రతిష్ఠ..
ఉత్సవాలకు వేంచేసిన సకల దేవతలకు అగ్నిముఖంగా హవిస్సులు అందించి పంచసూక్త హవనములు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపములతో దశాంగ తర్పణాదులు, స్మార్తాగమరీత్యా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంకాలం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో పారాయణీకులతో స్తోత్ర కుంభార్చనలు, వేద పారాయణాలు, నమక చమక, మంత్రపుష్ప పఠనములు, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు యాధావిధిగా నిర్వహించారు. అనంతరం లఘు పూర్ణాహుతి కార్యక్రమం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరాములు శర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధ్వజపటారోహణ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుడు, అష్ట మంగళ చిత్రాలను చిత్రీకరించి, అర్చించి ధ్వజస్తంభంపై అలంకరించారు. సకల దేవతలకు ఆహ్వాన సూచకంగా ఈ ధ్వజమును ఎగురవేశారు. దీనినే నందీశ్వర ధ్వజపటం అంటారని అలయ ప్రధానార్చకుడు నరసింహరాములు శర్మ తెలిపారు. ఈ ఆహ్వానంతో సకల దేవతలు ఉత్సవాలకు వేంచేస్తారని పురాణోక్తి.
నేడు రామలింగేశ్వరుడి కల్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి 7గంటలకు రామలింగేశ్వరుడి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శివ కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. ఒక్క టికెట్పై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని తెలిపారు.
భేరీపూజ, దేవతాహ్వానం
శబ్ధ బ్రహ్మయగు పరమేశ్వరుడికి ప్రీతిని కలిగించునది ఈ భేరీపూజ. నాట్యప్రియుడు, శబ్ధ బ్రహ్మయగు పరమేశ్వరుడికి రాగ, తాళములు అత్యంత ప్రీతిని కలిగించును. ఈ వేడుకలో డోలు వాయిద్యానికి పూజాధికారాలు నిర్వహించి నాద స్వరముపై ఆయా రాగ ఆలాపనలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.