రామగిరి/ ఆలేరు రూరల్, ఆగస్టు 29 : రక్తబంధానికి రూపం రక్ష. ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారినా తరుగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకొనే పండుగ. అన్నాచెల్లెల్ల అనుబంధానికి అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు సాక్షిభూతమై అవనిపై అజేయంగా వర్ధిల్లుతున్న సంబురం. ఇంతటి ప్రత్యేకమైన పండుగను శ్రావణ పౌర్ణమి నాడు ఈ నెల 31న జరుపుకోనున్నారు.
రకరకాల రంగులు, రూపాలు, హంగులతో ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. రుద్రాక్షలు, వినాయకస్వామి, రకరకాల పుష్పాలు, మిల్క్పాస్ వంటి వెరైటీ రాఖీలు, బంగారు పూతతో చేసిన రాకీట్లు అందుబాటులో ఉంచారు.
ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే.. మహిళలు రాఖీ కొని పోస్టు లేదా కొరియర్ ద్వారా తమ సోదరులకు పంపించేందుకు సెంటర్లకు వెళ్లడం, కవర్లు కొనడం వంటివి చేసేవారు. అయినా.. అవి సమయానికి చేరుతాయో.. లేదోననే సందేహం ఉండేది. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు కొత్తగా ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వైబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రాఖీ పంపిన సోదరీమణుల కోసం సోదరులు ఆన్లైన్లో వారికి చీరెలు, వాచీలు, బ్యాగులు తదితర బహుమతులు పంపవచ్చు. ఆన్లైన్లో అయితే సకాలంలో డెలివరీ అవుతాయి. స్థోమతను బట్టి రాఖీలను ఎంపిక చేసుకోవచ్చు. బిజీగా ఉండే వారికి ఆన్లైన్ మంచి అవకాశం.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నల్లగొండలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాఖీల కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కాలానికి అనుగుణంగా వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి ఉంచడంతో వాటిని మహిళలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. బేన్టెన్, చోటాభీమ్, ఫేస్బుక్ లోగో వంటి వెరైటీ రాఖీలను అందుబాటులో ఉంచారు. అయితే.. గురువారం పండుగ ఉండటంతో యువతులు, మహిళలు, చిన్నారులు వీటిని కొనుగోలు చేస్తుండటంతో ఆ ప్రాంతాలు సందడిగా ఉన్నాయి.
మమకారానికి ప్రతి రూపం రక్షాబంధన్. రాఖీ పండుగ వచ్చిందంటే మా ఇంట్లో పండుగ వాతావరణం కన్పిస్తుంది. ప్రతి రాఖీ పౌర్ణమి రోజు మా సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తాం. మా ప్రేమానురాగాలు మర్చిపోలేనివి. సోదరులు ఇచ్చిన కానుకలు వెలకట్టలేనివి.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్
రాఖీ పౌర్ణమి వేడుకను ఈ నెల 31న (గురువారం) జరుపుకోవాలి. ఇదే విషయాన్ని తెలంగాణ విద్వత్సభ అధికారికంగా నిర్ణయించింది. ప్రజలు ఆ రోజు ఎలాంటి సందేహాలు లేకుండా పండుగ జరుపుకోవచ్చు.
– పెన్నా మోహనశర్మ, ప్రముఖ సిద్ధాంతి, నల్లగొండ