ఆప్యాయతల కలబోతగా రక్షాబంధన్ రాఖీలు, కానుకలతో వెల్లివిరిసిన ఆనందం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాఖీ పండుగను గురువారం సంబురంగా జరుపుకొన్నారు. ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లన్నీ సందడిగా మారాయి. అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి సంతోషం పంచుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రయాణాలతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిశాయి. రాఖీ దుకాణాలు, స్వీట్ హౌస్లు కిటకిటలాడాయి.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ వేడుకలను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రేమానురాగాలతో జరపుకొన్నారు. సోదరీమణులు తమ ఆత్మీయబంధం పదిలంగా ఉండి సుఖసంతోషాలతో వర్థ్దిల్లాలని కోరుకుంటూ తమ పుట్టిళ్లకు వెళ్లి తోబుట్టువులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి సంబురాలు జరుపుకొన్నారు. ఆడబిడ్డలు, బంధువుల రాఖతో పల్లెలన్నీ సందడిగా కనిపించాయి. గ్రామాలు, పట్టణాలకు వెళ్లే వారితో బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు31