నల్లగొండ, నవంబర్ 17: త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రజియొద్దిన్ తెలిపారు. నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు చకిలం అనిల్ కుమార్తో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దిన్ ఒవైసీ ఆదేశాల ప్రకారం నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థ్దికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం లో ఇమామ్లకు గౌరవ వేతనం, గురుకుల విద్యాలయాలతో పాటు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నట్లు తెలిపారు.నల్లగొండలో ఎంఐఎం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నాలుగు సార్లు మద్దతు ఇస్తే ఆయన చేసిన అభివృద్ధ్ది మాత్రం శూన్యమన్నారు. నల్లగొండ మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి కంచర్ల గెలువాల్సిన అవసరం ఉందన్నారు.
నల్లగొండ నియోజక వర్గంలో మైనార్టీల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కుల మతాలకు అతీతంగా కేసీఆర్ అభివృద్ధ్ది ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంఐఎం మద్దతు ఇచ్చి మరోసారి నన్ను గెలిపిస్తే మైనార్టీలను తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నారు. గత రెండు పర్యాయాలు తన వెంట ఉన్న మైనార్టీలు ఈ సారి కూడా పూర్తి స్థాయిలో తగిన సాకారం అందించాలని కోరారు.
నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం ఎంఐఎంమద్దతు ఇవ్వడం శుభ పరిణామం అని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, నాయకులు చకిలం అనిల్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం ఉంటుందని అన్నారు. 2014 నుంచి కూడా కేసీఆర్కే మద్దతు ఇచ్చిన ఎంఐఎం మరోసారి ఇవ్వడం సంతోష కరమన్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం పట్టణాధ్యక్షుడు నజీబ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కనగల్ ఎంపీపీ కరీంపాషా, కటికం సత్తయ్య గౌడ్, జమాల్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.