సూర్యాపేట రూరల్, మార్చి 10 : బీసీలు బానిసత్వం వదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణ పరిధిలోని రాయిన్గూడెం గ్రామం వద్ద సెవెన్ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రాతిపదికన 56 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కేవలం ధన స్వామ్యమే నడుస్తుందని ఆయన ఆరోపించారు.
దేశ ప్రధాని బీసీ అయినప్పటికీ జరుగుతున్న అన్యాయంపై మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలు ఆత్మ పరిశీలన చేసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. ఏప్రిల్ 3న చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని పార్లమెంటు ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, ప్రముఖ వైద్యుడు రామ్మూర్తియాదవ్, బొల్క వెంకట్యాదవ్, గంధసిరి కిశోర్, వీరబోయిన లింగయ్యయాదవ్, అశోక్, జనార్దన్, రామకృష్ణ, శ్రీశైలం, సాయి, రాఖేశ్, అశోక్ పాల్గొన్నారు.