ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి. చిట్టి పొట్టి, చింట్లు రకాలైతే రూ.6,300 పైనే ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో బీపీటీ బియ్యం కొత్తవి క్వింటా రూ.3,300 నుంచి రూ.3,700 వరకు, పాతవి రూ.4వేల నుంచి రూ.4,500 ఉన్నాయి. ధరలు ఒకేసారి రూ.వెయ్యికిపైనే అదనంగా పెరిగాయి.
ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం, నీటి వనరులు సరిపడా లేకపోవడంతో సన్నాల సాగు తగ్గింది. నల్లగొండ జిల్లాలో 3.20 లక్షల ఎకరాల నుంచి 1.73 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఇక యాసంగిలోనూ సన్నాల సాగు అంతగా ఉండదు. మళ్లీ వానకాలం వరకు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో కొంత మంది ముందస్తుగా బియ్యం కొని పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
నల్లగొండ, డిసెంబర్ 16 : సన్న బియ్యం ధరలు సామాన్యుడి అంచనాలు మించి మార్కెట్లో సన్నాయి మోత మోగుతున్నాయి. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. రైస్ దుకాణాలతో పాటు మిల్లుల్లో ప్రస్తుతం బీపీటీ కొత్త బియ్యం క్వింటా రూ.4800 నుంచి రూ.5వేల వరకు అమ్ముతుండగా.. పాతవి (గత వానకాలం) రూ.5500కు పైగా అమ్ముతున్నారు.
ఇక చిట్టిపొట్టి, చింట్ల రకాల ధాన్యం అయితే క్వింటా బియ్యం 6300 రూపాయలకు పైనే అమ్ముతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో బీపీటీ, సన్నవి కొత్తవి క్వింటా రూ.3300 నుంచి రూ.3700 వరకు పలుకగా, పాతవి రూ.4వేల నుంచి రూ.4500 వరకు అందుబాటులో ఉండేది. నాలుగైదేండ్లుగా ప్రతి వానకాలం సీజన్లో ఈ పరిస్థితులు ఉండగా.. ఈ సారి అందుకు భిన్నంగా కొత్త బియ్యంతోపాటు పాతవి క్వింటాకు సగటున వెయ్యి రూపాయలు అదనంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎండబోసిన ధాన్యం క్వింటాకు రూ.3వేల నుంచి రూ.3400 వరకు ధర పలుకుతున్నది.
ప్రస్తుతం సన్న బియ్యం కొత్తవి అయితే క్వింటా రూ.5వేల వరకు, పాతవి రూ.5500, చిట్టి పొట్టి లాంటివి రూ.6300 దాకా అమ్ముతున్నారు. వచ్చే వానకాలం నాటికి వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ యాసంగి సీజన్లో సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేనందున ఆయకట్టుతోపాటు ఏఎమ్మార్పీ ద్వారా నీటి విడుదల ఉండదు. దాంతో ఈ యాసంగి సీజన్లో వరి సాగు తక్కువగా ఉండటంతోపాటు వేసవిలో భూగర్భ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉన్నది. దాంతో ప్రస్తుతం వరి సాగు చేసే రైతులు కూడా దొడ్డు రకాలు సాగు చేసే అవకాశం ఉంటుంది. మళ్లీ సన్న రకాల ధాన్యం సాగు కావాలంటే వచ్చే వానకాలం సీజన్పైనే ఆధార పడాల్సి ఉన్నది. ఫలితంగా అప్పటి వరకు సన్న బియ్యం ధరలు ఇంతకుమించి పెరిగే అవకాశం ఉండనుంది.
జిల్లాలో ఈ సారి సన్న బియ్యం ధరలు అమాంతం పెరుగడానికి పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగా రైతులు ఎక్కువగా వానకాలం సీజన్లోనే సన్న వడ్లు సాగు చేస్తుంటారు. అయితే.. ఈ వానకాలంలో జిల్లాలో సన్న ధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటున్నది. గత ఏడాది జిల్లాలో 5.04 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 3.20 లక్షల (63శాతం) ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు.
ఈ ఏడాది 5.05 లక్షల ఎకరాల్లో వరి సాగు అయినప్పటికీ అందులో 1.73 లక్షల ఎకరాల్లో (32శాతం) మాత్రమే సన్న రకం ధాన్యం సాగు చేశారు. గత ఏడాది వానకాలం సీజన్తో పొలిస్తే ఈ ఏడాది 31శాతం సన్న ధాన్యం సాగు తక్కువగా అయ్యింది. సాగు నీటి వనరుల కొరతే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సన్న వరి సాగు కాలం కంటే దొడ్డు రకాల సాగు సమయం తక్కువ ఉండటం, నీటి వనరుల కొరతతో రైతులు తక్కువగా వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గత వానకాలం సీజన్ కంటే ఈ సారి సన్న రకం ధాన్యం మిల్లులకు చాలా తక్కువగా వచ్చింది. సాగు తక్కువగా అయినందున రైతులు తమకు కావాల్సినవి ఉంచుకొని మిగిలినవి మిల్లులకు తీసుకొచ్చి అమ్మారు. ఈ సారి చిట్టిపొట్టి వంటి సన్న రకం ధాన్యాన్ని క్వింటా రూ.3400 దాకా పెట్టి కొన్నాం. బీపీటీ కూడా రూ.3వేల వరకు నడుస్తున్నది. గతంలో మన ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయగా.. ఈ సారి ఇక్కడే వీటికి బాగా డిమాండ్ ఉన్నది. సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు బాగా కలిసి వచ్చింది.
– వెంకటరమణ, మిల్లర్, మిర్యాలగూడ
ఈ మధ్యనే వానకాలం సీజన్ బియ్యం మార్కెట్కు వచ్చినయ్. బియ్యం కొందామని మార్కెట్కు వెళ్తే కొత్తవి రూ.5వేలు అంటున్నరు. ఇప్పుడే ఇంత ధరలు ఉంటే ఇంకో సీజన్ వచ్చేసరికి ఎట్ల ఉంటదో అని తెలిసి అప్పు చేసి నాలుగు క్వింటాళ్ల బియ్యం కొన్నా. పాత బియ్యం అయితే 5500 రూపాయలు అంటున్నరు. ఈ సారి ధరలు ఇట్ల పెరిగినయి ఏందని అడిగితే సన్న రకం వరి ఎక్కువ సాగు చేయలేదంటున్నరు. అయినా తినకుండ ఉండలేము కదా అని ముందే కొని పెట్టుకున్నం.
– కొయ్యగూర గణేశ్, వినియోగదారుడు, నల్లగొండ
నేను మంగళి వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. మాకు ప్రతి నెలా ఇంట్లో అర క్వింటా వరకు బియ్యం పడుతాయి. కొత్త బియ్యం అయితే అన్నం బాగ కాదని పాతవి మాత్రమే కొంటాను. ఈ నెల బియ్యం కొనేందుకు మార్కెట్కు పోతే గత నెల కంటే క్వింటాకు రూ.800 అదనంగా చెప్పారు. అంతకుముందు నెల క్వింటా బియ్యం రూ.5వేలకు కొన్నా. ఇప్పుడు రూ.5800 పెట్టి కొనుగోలు చేశా. నాకు వచ్చే కొద్దిపాటి ఆదాయానికి బియ్యం ధర పెరుగడం కొంత భారమే. గత పదేండ్లలో ఎప్పుడూ ఇంతగా పెరుగలేదు.
-పిన్నెల్లి వెంకటేశ్, సూర్యాపేట