– జెన్కో రూ.54 వేల కోట్ల బకాయిపై నోరు మెదపని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– అవంతిక, డిప్సైడ్, కోయగూడెం, జేకే-5 ఎక్స్టెన్షన్ బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి
– ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి
– ఏఐటీయూసీ నేత మిరియాల రంగయ్య డిమాండ్
రుద్రంపూర్, జూలై 25 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుండి రావాల్సిన రూ.54 వేల కోట్ల మొండి బకాయిల అంశాన్ని సమీక్ష సమావేశంలో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెంలో జెన్కో, సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సింగరేణి ఆర్థిక పరిస్థితికి అత్యంత కీలకమైన బకాయిల అంశంపై చర్చ జరగాల్సి ఉండేదన్నారు. జెన్కో బకాయిలను కనీసం విడతల వారీగా అయినా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని, సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సత్తుపల్లి అవంతిక ప్రాజెక్టు, మణుగూరు డిప్సైడ్ బ్లాక్, కోయగూడెం,ఇల్లందు జేకే-5 ఎక్స్టెన్షన్ వంటి బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
దీంతో సంస్థకు భవిష్యత్లో ఉత్పత్తి పెరిగి, వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రపడుతుందన్నారు. రామ్ పురం మైన్ గ్యాసిఫికేషన్కు అత్యంత అనుకూలమైన గనిని తక్షణమే ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇది సింగరేణి భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఇన్వాలిడేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వారు, పక్షవాతం (పారాలిసిస్)తో పాటు వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి ఇన్వాలిడేషన్ మంజూరు చేయడం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన కోసం కార్మికులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారని, ఆ ప్రకటనను వెంటనే విడుదల చేసి కార్మికులకు లాభాల వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.