సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలు అన్నీఇన్నీ కావు. గృహాలకు, వ్యవసాయానికి అరకొర కరెంటిచ్చి పరిశ్రమలకు మాత్రం చుక్కలు చూపించారు. ఏనాడూ నిర్ధిష్ట సమయానికి కరెంటు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా పారిశ్రామిక రంగం కుదేలైంది. కొత్త పరిశ్రమలు రాక ఉన్న పరిశ్రమలు మూతపడి ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పవర్ హాలిడేస్తోపాటు ఒకటి లేదా రెండు షిఫ్టుల్లోనే పని దినాలు గడిచిపోయేవి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనతికాలంలోనే ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
24గంటల పాటు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందిస్తూ దేశంలో రాష్ర్టాన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దారు. నిరంతర కరెంటుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక కొత్త పరిశ్రమలు రావడంతోపాటు ఉన్న పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దాంతో పారిశ్రామిక ఉత్పత్తులు భారీగా పెరుగడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. దేశం నలుమూలల నుంచి జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేసేందుకు భారీగా వలస వస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలతోపాటు చేతినిండా పని దొరుకుతుండడంతో కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
24 గంటల కరెంట్తో చేతినిండా పని నేను నకిరేకల్ పన్నాలగూడెంలో వుడ్ అండ్ డెకోలం ఫర్నిచర్
వర్క్ షాపును 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వంలో కరెంటు కోతల వల్ల శానా ఇబ్బందులు పడ్డాం. తలుపులు, కిటికీలు, దర్వాజలకు సంబంధించిన ఆర్డర్లు తీసుకోవాలంటే భయపడేవాళ్లం. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. మా పనులు సజావుగా సాగుతున్నాయి. ఆదాయం కూడా పెరిగింది. మా లాంటి వారందరికీ తెలంగాణ వచ్చినంక మంచి రోజులొచ్చాయి.
– గడగోజు, రవీంద్రాచారి, నకిరేకల్
నల్లగొండ ప్రతినిధి, జనవరి2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటే అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు నిదర్శనంగా కనిపించేది. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ పెద్దగా గుర్తింపు దక్కలేదు. మౌలిక వసతుల కల్పనలో అప్పటి పాలకులకు కనీస శ్రద్ధ లేకపోవడంతో పారిశ్రామికంగా పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అరకొర వసతుల నడుమ పరిశ్రమలు స్థాపించినా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండేది కాదు. ముఖ్యంగా ఏ పరిశ్రమ నడవాలన్నా అసరమైన కరెంట్ సరఫరా అత్యంత ముఖ్యం. సమైక్య పాలనలో కరెంట్ సరఫరాపై ఏనాడూ దృష్టి సారించలేదు.
ఉమ్మడి జిల్లా పరిధిలో సిమెంట్ పరిశ్రమలు, రైస్ ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీలు ఏర్పాటైనా వీటికి అవసరమైన కరెంట్ ఇవ్వలేదు. గ్రానైట్, స్టోన్ క్రషర్స్, పవర్లూమ్స్తో పాటు పలు రకాల పరిశ్రమలకు సైతం కరెంటు కోతలు గుదిబండలుగా ఉండేవి. దీంతో వీటిల్లో కొద్ది గంటలే ఉత్పత్తి కొనసాగేది. మిగతా సమయంతా మోటర్లు బంద్ చేసుకుని ఖాళీగా ఉండేవారు. దీంతో వీటి సామర్థ్యాలకు అనుగుణంగా ఉత్పత్తులు జరిగేవి కావు. సిమెంట్, రైస్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా కరెంటు సరఫరా లేక ఉత్పత్తులు చేయలేక పోయేవారు.
వేసవితో పాటు ముఖ్యమైన సందర్భాల్లో పవర్ హాలీడేస్ సర్వసాధారణంగా మారేవి. మూడు షిఫ్టుల్లో నడిచే అవకాశం ఉన్న కంపెనీల్లో సైతం ఒకటి లేదా రెండు షిఫ్టులకే పరిమితం అయ్యేవారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. రోజువారీ కూలీలు, తాత్కాలిక సిబ్బంది నెలలో సగం రోజులు ఇండ్లకే పరిమితం కాక తప్పేది కాదు. సమైక్య రాష్ట్రంలో అస్తవ్యస్త కరెంటు సరఫరాతో పారిశ్రామిక రంగం నిరాశ నిస్పృహ వాతావరణంలో కనిపించేది.
నిరంతర విద్యుత్తో.. కొత్త వెలుగులు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొద్ది కాలంలోనే కరెంట్ సరఫరా వ్యవస్థపై దృష్టి సారించి సక్సెస్ అయ్యారు. ప్రారంభంలో ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనుగోలు చేసి ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే అదనపు కరెంటు ఉత్పత్తిపై దృష్టి సారించారు. అనతికాలంలోనే నిరంతరం విద్యుత్తో దేశానికే ఆదర్శంగా నిలిపారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు సైతం 24గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ పారిశ్రామికంగా కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం 19.5మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. వేసవిలో ఒక్కో రోజు 22మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ పెరుగుతుంది. అయినా సరే డిమాండ్కు అనుగుణంగా కరెంట్ను సరఫరా చేస్తూ ఆటంకాలు లేకుండా చూస్తున్నారు.
24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడమే గాక నాణ్యమైన కరెంట్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎనిమిదేండ్ల కాలంలో కొత్త జిల్లాల ప్రకారం ఒక్క నల్లగొండలోనే రూ.1171.60కోట్లను వెచ్చించారు. కొత్త సబ్స్టేషన్లతో పాటు లైన్ల విస్తరణ, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ఇలా ఎన్నో చర్యలు చేపట్టారు. జిల్లాకు చెందిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడం మరింతగా ప్రయోజకనకరంగా మారింది. స్వయంగా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో కరెంట్ సరఫరాలో వేగంగా నాణ్యమైన సేవలకు ఆస్కారం ఏర్పడింది. దీనికి నల్లగొండ జిల్లాలోని గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 2715 పరిశ్రమలు ఉండగా అందులో తెలంగాణ ఏర్పాటయ్యాక స్థాపించినవే 513కావడం గమనార్హం. ఇవన్నీ కూడా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పనతోనే అనేది కాదనలేని సత్యం. పరిశ్రమలు నడపడలో కీలకమైన కరెంట్కు ఎలాంటి అవరోధాలు లేకపోవడం శుభ పరిణామంగా పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. గృహ అవసరాలతో పాటు వాణిజ్యపరంగా, వ్యవసాయంలోనూ, పారిశ్రామికంగానూ ఎంతో పురోభివృద్ధికి తోడ్పాటు లభిస్తుంది. నడి వేసవిలో సైతం నిత్యం 24గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడం విశేషం.
వాణిజ్య అవసరాలకు సైతం
ఇక ఇళ్లలో నడిపే కుటీర పరిశ్రమలతో పాటు వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, అన్ని రకాల వ్యాపార వర్గాలకు సైతం నిరంతర కరెంట్ సరఫరా కొనసాగుతున్నది. దీంతో ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షాపింగ్మాల్స్తో పాటు ఓ మాదిరి వ్యాపార సంస్థల్లో గతంలో కరెంటు కోతలతో తప్పనిసరిగా జనరేటర్ వినియోగించేవారు. కానీ జనరేటర్ల వినియోగం భారీ ఖర్చుతో కూడికున్నది కావడంతో వచ్చిన ఆదాయంలో గణనీయంగా దానికే పెట్టాల్సి వచ్చేది. పైగా వినియోగదారులు సైతం కరెంటు కోతలతో ఇబ్బంది పడేవారు. దీంతో వ్యాపార కార్యకలాపాలు మందకొడిగా సాగేవి. ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరాతో ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇక కరెంట్పై ఆధారపడి రోజువారీ ఉపాధి పొందే వారి జీవితాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అన్ని రకాల వ్యాపారవర్గాలు, సామాన్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితోనే ఇదంతా సాధ్యమవుతుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
కనెక్షన్లు పెరిగినా.. నిరంతర సరఫరా
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి జిల్లాలో కేటగిరి 3,4,5లతో పాటు హెచ్టీ కనెక్షన్లు కలిపి సుమారు లక్ష వరకు పారిశ్రామిక రంగంలో ఉన్నాయి. కానీ అవి స్వరాష్ట్రంలో భారీగా పెరిగాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం నేడు అవి 1.55లక్షలకు పెరిగాయి. సుమారు ఐదేండ్లల్లోనే 50శాతం పెరగడం అంటే మామూలు విషయం కాదు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు సైతం నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించిన నాటి నుంచి పారిశ్రామిక రంగానికి మంచి ఊతం ఇచ్చినైట్లెంది. కేవలం సరఫరా ప్రకటనలతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. కనెక్షన్లు పెరుగుతున్నా కొద్దీ అందుకు అనుగుణంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల విస్తరణ, కొత్త లైన్ల ఏర్పాటు ఇలా అనేక చర్యలు చేపట్టారు. అందుకే కనెక్షన్లు పెరిగినా… డిమాండ్కు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతుంది. పవర్ హాలీడేస్ను గత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.
పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్కు అనుగుణంగా మూడు షిఫ్టులు నడిపేలా వెలుసుబాటు లభించింది. దీంతో చాలా కంపెనీలు మూ డు షిఫ్టుల్లోనూ నడుపుతున్నారు. దీంతో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. జిల్లాతో పాటు ఉత్తరాది భారతానికి చెందిన అనేక రాష్ర్టాల కార్మికులు, సిబ్బంది జిల్లాకు ఉపాధి కోసం తరలివచ్చారు. సిమెంట్, రైస్, జిన్నింగ్, ఫార్మా తదితర రంగాల్లో పెద్ద సంఖ్యలో ఇతర రాష్ర్టాల కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చేతినిండా పని దొరకుతుండడంతో ఏటేటా ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని కంపెనీలకు వలస కార్మికుల సంఖ్య పెరుగుతోంది. నిరంతర కరెంట్ అటు పరిశ్రమ యాజమాన్యాలకు లాభాలు పండిస్తుండగా ఇటు ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు భరోసా ఇస్తున్నది.
పనులు సులభంగా చేసుకోగలగుతున్నాము
కోదాడ టౌన్ : నిరంతరం విద్యుత్తో మెకానిక్ పనులను సులభంగా చేసుకోగలగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కరెంట్తో ఇబ్బందులు పోయాయి. గతంలో కరెంట్ వస్తూ పోతుంటే మెకానిక్ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు నిరంతరం విద్యుత్ ఉండడంతో అన్ని కరెంట్కి సంబంధించిన మిషన్లతో పనులను సులభంగా చేసుకుంటున్నాం.
– శ్యాం, బైక్ మెకానిక్, కోదాడ
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీరినయ్
గరిడేపల్లి : గతంలో వెల్డింగ్ పని చేయాలంటే మాటిమాటికి కరెంట్ పోయి పని సాగకపోయేది. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో దేవుడికే ఎరుక అన్నట్లు ఉండేది పరిస్థితి. పనులు బాగా సాగక గంటలు, గంటలు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేది. కరెంట్ ఉన్న కొద్దిసేపు లోఓల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కరెంట్ కష్టాలన్నీ తీరిపోయినయ్. ప్రస్తుతం వ్యవసాయ పనులు నడుస్తున్నందున ట్రాక్టర్ నాగళ్లు, దమ్ము చక్రాలకు సంబంధించిన పనులకు వస్తున్నరు. ప్రస్తుతం కరెంట్ పోకపోవడంతో నిరంతరాయంగా పని సాగుతుంది. షాపునకు వచ్చిన రైతులకెలాంటి ఇబ్బంది లేకుండా పనులు వెంటనే పూర్తి చేసి పంపుతున్నాం. గతంలో కంటే ఇప్పుడు పనులు సజావుగా సాగుతున్నాయి. ఇది సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందనడంలో సందేహం లేదు.
– మన్సూర్ అలీ, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు
కరెంట్ ఆదాతో డబ్బులు మిగులుతున్నయ్
సూర్యాపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో పాటు, ఎప్పుడు వస్తదో పోతదో తెలియక ఇబ్బంది పడేవాళ్లం. కరెంట్ పోయిందంటే జనరేటర్ వాడేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్లం. దీంతో వచ్చిన లాభం అక్కడికక్కడికే సరిపోయేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24గంటల కరెంటు ఇవ్వడంతో ఇప్పుడు ఇబ్బందులు లేవు. నిరంతర విద్యుత్ సరఫరాతో డబ్బులు మిగులుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– ఎస్కే.రఫి, హోటల్ యజమాని, గాంధీగనర్
కరెంట్ పోదు.. ఉపాధికి ఢోకా లేదు
చివ్వెంల : నేను సూర్యాపేట పట్టణంలోని బీబీగూడెం శివారులో 20ఏండ్ల క్రితం 10మంది కూలీలతో బాలాజీ లైట్వేట్ బ్రిక్స్ కంపెనీ స్థాపించా. గతంలో విపరీతమైన కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కనీసం 10గంటలు కరెంట్ కోతలుండేవి. రోజులో ఒక్కపూట మాత్రమే పని చేసేవారు. కరెంటు ఎప్పుడొస్తదా అని ఎదురుచూసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పగటి పూటతో పాటు అవసరాన్ని బట్టి రాత్రి సైతం బ్రిక్స్ తయారు చేస్తున్నాం. గతంలో 10మందితో స్థాపించిన కపెంనీని విస్తరించి ప్రస్తుతం 200మందికి ఉపాధి కల్పిస్తున్నా. కూలీలకు పని దొరకడంతో పాటు ఆదాయం పెరిగింది. కూలీలు అదనపు డ్యూటీలు చేసి రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నారు. గిదంతా సీఏం కేసీఆర్ సార్తోనే సాధ్యమైంది.
– భూక్యా బాలూనాయక్, బాలాజీ లైట్వేట్ బ్రిక్స్ కంపెనీ యజమాని
పరిశ్రమలు అభివృద్ధి చెందాయి
వేములపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్తో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. సమైక్య పాలనలో చీటికిమాటికి కరెంట్ పోతుండేది. దీంతో పరిశ్రమలో యంత్రాలు పాడై పనుల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు వచ్చాయి. రెప్పపాటు సైతం కోతలు లేకుండా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ అందిస్తుండడంతో పనులు సాఫీగా సాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
– గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ రైస్మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్
నిరంతర విద్యుత్తో 10మందికి ఉపాధి
దేవరకొండ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాతో మాకున్న ప్లాస్టిక్ పైపుల కంపెనీలో 10మందికి ఉపాధి కల్పిస్తున్నాం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధికారం చేపట్టాక పైపుల పరిశ్రమకు 100కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ కొరత లేకుండా 12గంటల పాటు పైపులు తయారు చేస్తున్నాం. మేము చేసిన పైపులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. నిరంతర విద్యుత్తో చేతినిండా పని ఉండడంతో ఇతరులకు ఉపాధి కల్పిస్తూ సంతోషంగా జీవితం సాగిస్తున్నాం.
– గుర్రం నర్సంహ, ప్లాస్టిక్ పైపుల కంపెనీ నిర్వాహకుడు
చేతినిండా వెల్లింగ్ పని
కొండమల్లేపల్లి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్ కొరత లేకపొవడంతో చేతి నిండా పని వుండి డబ్బులు కనిపిస్తున్నాయి. గతంలో కరెంటు సరిగా లేక పొవడంతో పని చేసే వర్కర్లకు జీతాలు ఇవ్వడం భారమయ్యేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చేతినిండా పని ఉండి వర్కర్లకు సకాలంలో జీతాలు పోను తమకు కొంత డబ్బులు ఉంటున్నాయని చెప్పారు. వెల్డింగ్ పనులు చేతి నిండా ఉండి పని అందరికి ఉంటుందని తెలిపారు.
– గట్టుపల్లి శేఖర్రెడ్డి, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు