పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 76 గ్రామాల్లో పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిని మూడు దశల్లో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న సర్కారు భవనాలను వినియోగించి ఒక్కో లైబ్రరీకి 1.40లక్షలు ఖర్చు చేయనున్నారు.గ్రంథాలయంలో పుస్తకాలు, పిరియాడికల్స్తోపాటు డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు యోచిస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పట్టణ పరిధిలో సింగన్నగూడెం వద్ద అన్ని హంగులతో మోడల్ లైబ్రరీని తీర్చిదిద్దారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. అన్ని గ్రామాల్లోనూ ఇదే మోడల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
Public libraries | యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నది. ఈ క్రమంలో గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు నడుస్తుండగా.. పల్లెలకు కూడా విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ లైబ్రరీలు తీసుకురావాలని భావించింది. దీనికి సంబంధించి ఇటీవల గైడ్లైన్స్తో కూడిన ప్రొసీడింగ్ కూడా ఇచ్చింది. ఈ గ్రంథాలయాలను అందరూ ఉపయోగించుకోవచ్చు. జిల్లాలో 76 పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. మొదటి విడుతగా 20 గ్రంథాలయాలను అందుబాటులోకి తేనున్నారు. మరో రెండు విడుతల్లో మిగతా వాటిని కూడా మొత్తం ఐదు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల భువనగిరి మున్సిపాలిటీలో రెండు లైబ్రరీల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు అనుమతి కోసం లెటర్ కూడా పంపించారు. పబ్లిక్ లైబ్రరీలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోనే నడవనున్నాయి.
జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వివిధ కారణాలతో ఉపయోగించని ప్రభుత్వ భవనాలను అధికారులు గుర్తించారు. వెటర్నరీ ఆస్పత్రి, పీహెచ్సీలు, కమ్యూనిటీ హాళ్లు, పాల కేంద్రాలు, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు, హాస్టళ్లను ఐడెంటిఫై చేశారు. వీటిని వినియోగంలోకి తెచ్చి పబ్లిక్ లైబ్రరీల కోసం ఉపయోగించనున్నారు. వీటిలోని కొన్ని భవనాల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. పెయింటింగ్తోపాటు మైనర్ రిపేర్లు చేయనున్నారు. ఒక్కో లైబ్రరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.40లక్షల వరకు ఖర్చు చేయనుంది. మొదటగా సీఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రారంభించాలని భావించినా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి విద్యాశాఖ ద్వారా నిధుల మంజూరుకు ఇటీవల అనుమతిని ఇప్పించింది.
అన్ని వయస్సుల వారు చదువుకునేలా పబ్లిక్ లైబర్రీలను తీర్చిదిద్దనున్నారు. బుక్స్, పీరియాడికల్స్, మ్యాగజైన్స్ అందుబాటులో ఉంచనున్నారు. డిజిటల్ లైబ్రరీలు కూడా తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రెండో దశలో డిజిటల్ లైబ్రరీకి ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. లైబ్రరీల నిర్వహణకు ప్రత్యేకంగా వ్యక్తిని నియమించనున్నారు. అన్ని రకాలు సదుపాయాలు కల్పించనున్నారు. ఇక పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వస్తే విద్యార్థులు, యువత, వృద్ధులు చదువుకునేందుకు వేదిక అవుతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగులకు సైతం ఎంతగానో ఉపయోగపడనుంది.
భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద ఇటీవల పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భవనం వృథాగా ఉంది. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పర్యవేక్షణలో పబ్లిక్ లైబ్రరీని సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ గ్రంథాలయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ స్థలం ఎక్కువగా ఉండటంతో లైబ్రరీతోపాటు ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. గోడలపై రంగులు, బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా గదులను తీర్చిదిద్ది అందుబాటులో ఉంచారు.