గిరిజన రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం గిరి వికాస పథకాన్ని తీసుకొచ్చింది. మెట్ట పంటలు సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న గిరిజనుల భూముల్లో ఉచితంగా బోరు వేసి కరెంట్, పైప్లైన్ సదుపాయం కల్పించడం దీని ఉద్దేశం. ఒకేచోట ఇద్దరుముగ్గురు రైతులకు ఐదెకరాలకు మించి భూమి ఉంటే దీనికి అర్హులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే అనేక బ్లాక్ల్లో సాగునీటి వసతి కల్పించి సాగులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా జిల్లాలో కొత్తగా 877 ఎకరాల్లో 153 బ్లాక్లను గుర్తించారు. దీని కోసం రూ. 1.90 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద మెట్ట భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా బండరాళ్లను తొలగించే పనులు చేపడుతున్నారు. పండ్ల మొక్కలను సరఫరా చేస్తున్నారు. సాగులో మెళకువలు అందిస్తున్నారు
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎస్టీ రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గిరిజన వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన భూములను సాగులోకి తీసుకురావడం, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ అమలు చేస్తున్నది. నగదు బదిలీ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నది.
సొంతంగా బోరు, మోటరు, విద్యుత్ సౌకర్యం కల్పించుకోలేక మెట్ట పంటలు సాగు చేసుకునే గిరిజనుల భూములకు ఈ పథకం ద్వారా సాగు నీటి వసతి కల్పిస్తారు. గిరిజన రైతుల పొలాలకు బోర్లు వేయిస్తారు. బావులు తవ్విస్తారు. బోర్లు ఉన్న రైతులకు విద్యుత్ సదుపాయం కల్పిస్తారు. ఉపాధి హామీ పనుల ద్వారా బండ రాళ్లు, పిచ్చి మొక్కలు, స్టంప్లు, తొలగించి బంజరు భూములను సాగుకు యోగ్యంగా మారుస్తారు. పండ్ల మొక్కల సరఫరాతోపాటు సాగులో సలహాలు కూడా అందిస్తారు.
ఈ పథకం కింద గిరిజన రైతులను గుర్తించి, వారి భూముల్లో జియాలజిస్ట్ సర్వే చేస్తారు. ఆయన సిఫార్సు చేసిన చోట బోరు బావి తవ్వించి, విద్యుత్ సదుపాయం కల్పించి మోటరు పంపుసెట్లను బిగిస్తారు. అవసరమైన చోట భూమి అభివృద్ధి పనులు, సహజ వనరుల యాజమాన్యం పనులు చేపడుతారు. ఈ పథకానికి గిరిజనులే అర్హులు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులను కలిపి ఒక బ్లాక్గా గుర్తిస్తారు. ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండకూడదు. ఒక బ్లాక్లో ఐదెకరాలకు మించి భూమి ఉండాలి. ఒక బ్లాక్కు చెందిన భూమి కంటిన్యూగా ఉండాలి. షెడ్యూల్డ్ తెగల వారికి సంబంధించిన అసైన్డ్, పట్టా భూములు కూడా పరిగణలోకి తీసుకుంటారు.
గిరి వికాసం పథకం ద్వారా ఒక బోరు బావి తవ్వేందుకు రూ.65,825 చొప్పున చెల్లిస్తారు. లేదా బోరు బావి తవ్విన లోతు ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. విద్యుదీకరణకు విద్యుత్ శాఖ అంచనాల మేరకు నిధులు విడుదల చేస్తారు. మోటర్ పంపు సెట్లు సరఫరా చేసేందుకు టెండర్ ద్వారా సరఫరాదారులను గుర్తిస్తారు. ఒక్కో మోటరు పంపుసెట్టుకు రూ.89,500 ఇస్తారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 877 ఎకరాల్లో 153 కొత్త బ్లాక్లను గుర్తించారు. ఇందులో 135 ఎకరాల్లో జియాలజిస్ట్ ద్వారా సర్వే చేశారు. 24 బ్లాక్ల్లో బోర్వెల్ డ్రింల్లింగ్ చేసేందుకు సిఫార్సు చేశారు. వీటిల్లో 18 బ్లాక్ల్లో ఇప్పటికే బోర్వెల్ డ్రిల్లింగ్ పూర్తయింది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి జిల్లాకు రూ.1,88,28,000 నిధులు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.91,85,892 ఉపయోగించారు.
గతంలో ఇందిర జల ప్రభ పథకం ఉండేది. ఈ పథకంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం పరిజ్ఞానం లేని వారికి బాధ్యతలు అప్పగించడం వల్ల కమీషన్లకు కక్కుర్తిపడి.. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీంతో ఆ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. గిరిజన రైతులకు కూడా లబ్ధి చేకూరలేదు. దీంతో 2014 కంటే ముందు అది వివిధ కారణాలతో ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గిరి వికాసం పథకం అమల్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అమలు చేస్తున్నది.
అర్హత కలిగిన భూములను గుర్తించి బ్లాక్లుగా ఏర్పాటు చేయడానికి మండలాల్లో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. అందులో గ్రామీణాభివృద్ధి శాఖ పీఓ/ ఎంపీడీఓ/ ఏపీఓ, సహాయ గిరిజన శాఖాధికారి, తాసీల్దార్, విద్యుత్ శాఖ ఏఈ ఉంటారు. ఈ కమిటీ సభ్యులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమన్వయం చేసుకుని గిరిజనుల భూములను గుర్తిస్తారు. ప్రత్యక్షంగా పర్యవేక్షించి.. బ్లాక్లుగా ఏర్పాటు చేస్తారు.