– సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు
దామరచర్ల, జూన్ 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ మండల సమితి సమావేశం కామ్రేడ్ డి.లింగా నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా బంటు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు ఇప్పటికీ ఆరుసార్లు పెంచడంతో సామాన్య ప్రజలకు గుదిబండగా మారిందన్నారు.
రైతు కొనే అడుగు పిండి బస్తాకు రూ.300 నుండి 400 పెంచడం వల్ల, యూరియా ఆన్లైన్ యాప్ ద్వారా బుకింగ్ చేయాలంటే 60 శాతం రైతులకు ఆ యాప్ గురించి అవగాహన లేకపోవడంతో రైతులు యూరియా గురించి అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆ యాప్ ని రద్దుచేసి రైతులకు అధికారుల ద్వారా నేరుగా యూరియా అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్, సహాయ కార్యదర్శి డి.శాంత, మండల సమితి సభ్యులు జమ్ముల కోటయ్య, భాగం శేషయ్య, జి.శ్రీనివాస్ రెడ్డి, పి.లక్ష్మయ్య, వెంకన్న, వేణు పాల్గొన్నారు.