రామగిరి, నవంబర్ 4: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ మంగళవారం రెండోరోజు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కొనసాగింది. బంద్లో భాగంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీఎంఏ-ఎంజీయూ) నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నా చేశారు.
యూనివర్సిటీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ నాలుగేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదురొంటున్నాయన్నారు.ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామన్నారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో టీపీడీపీఎంఏ-ఎంజీయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి హనుమంతు యాదవ్, ఉపాధ్యక్షుడు సుభాష్ రెడ్డి, వివిధ కళాశాల యాజమాన్యాలు అసోసియేషన్ రాష్ట ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మారం నాగేందర్ రెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి, వివిధ కళాశాల యాజమాన్యాలకు చెందిన ధనుంజయ, వెంకట్ రెడ్డి, శ్రీనాథ్, నగేష్, అనిల్, సుధాకర్ ఉన్నారు.