సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా కాళేశ్వరం జలాలకు లక్ష మందితో హారతులు ఇచ్చేందుకు రైతులు, మహిళలు, పెద్దలు, పిల్లలు సిద్ధమయ్యారు. సూర్యాపేట జిల్లాలో కాకతీయుల కాలం నుంచి వ్యవసాయం అద్భుతంగా ఉండగా, గత 60 ఏండ్ల సమైక్య పాలనలో ఏటికేడు వ్యవసాయం కునారిల్లింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోని బావుల్లో బకెట్లతో నీళ్లు అందుకోగా, ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన దుస్థితి. ఫలితంగా ఉపాధి కోసం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలు పట్నం బాటన వలస పట్టారు. ఐదు దశాబ్దాల పాటు ఊరించిన ఎస్ఆర్ఎస్పీ జలాలు కలగానే మిగిలాయి. నీళ్లిచ్చే ఉద్దేశం లేకపోయినా ఎన్నికల కోసం, కమీషన్ల కోసం తీసిన కాల్వలు ఏండ్లకేండ్లు వెక్కిరించాయి. 1972 నుంచి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తెస్తామంటూ హామీలు ఇచ్చి కాల్వలు తవ్వడం ప్రారంభిస్తే 2018 వరకు నీటి జాడ లేదు.
గతంలో ఓ నాయకుడు నీళ్లు తెస్తానంటూ శంకుస్థాపన చేస్తే, దోతి కట్టుకొని వచ్చిన మరో నాయకుడు మొక్కలు నాటాడు తప్ప సూర్యాపేటకు సాగునీటిని ఇవ్వలేదు. 350 కిలోమీటర్లపైనే బయల్దేరిన 6వేల క్యూసెక్కుల నీళ్లను కాకతీయ కాల్వల ద్వారా ఇక్కడికి తేలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. నేడు ఆ నీళ్లే సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చివరి ఆయకట్టు పెన్పహాడ్ మండలం రావిచెరువుకు నీళ్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. తమ కలలను నిజం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా ప్రజలు బుధవారం కాళేశ్వరం జలాలకు లక్ష హారతి పట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. 7 మండలాల్లోని 126 గ్రామాల్లో ఈ జల సంబురం సాగనున్నది.
లక్ష హారతిని విజయవంతం ఆయా చేయాలని ఆయా గ్రామాల మహిళా రైతులు మంగళవారం సాయంత్రం ఇంటింటికీ తిరిగి బొట్టు అప్పజెప్పారు. నాగారం మండలం ఈటూరు నుంచి పెన్పహాడ్ మండలం రావిచెరువు వరకు 68 కిలోమీటర్ల మేర కాల్వల వెంట పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొనాలని విజయవంతం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక్ష సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రతి పావు కిలోమీటర్కు ఒక ప్రత్యేక అధికారి చొప్పున 280 మందిని నియమించారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఇచ్చేలా అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ, బోనాలు, మంగళవాయిద్యాలతో ఊరువాడ కదిలి రావాలని, లక్ష హారతి కార్యక్రమం బొడ్రాయి పండుగను మరిపించాలని కోరారు.
కలెక్టరేట్లో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట : కాళేశ్వరం జలాలకు 68 కిలోమీటర్ల పొడువునా లక్ష మందితో లక్ష హారతుల స్వాగతం పలికి సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగునీటి దినోత్సవంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా తొలి లబ్ధ్ది పొందిందన్నారు. జిల్లా రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించే సాగునీటి దినోత్సవాన్ని కాళేశ్వర జలాలతో లక్షహారతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గ్రామాల్లో జరిగే బొడ్రాయి పండుగను మరిపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం జరిగే ప్రతి చోట భోజన ఏర్పాట్లు చేయాలని తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగ య్యయాదవ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హమంత్ కేశవ్, జిల్లా నీటి పారుదల అధికారి రమేశ్బాబు సమావేశంలో పాల్గొనగా ప్రజాప్రతినిధులు, మండలాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
సాగునీటి రంగం ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రగతి సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకట్రావ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూ ర్యాపేట నియోజక వర్గం చివ్వెంల మండలం డీబీఎం 71 కాలువ వద్ద, నాగారం మం డలం జి కొత్తపల్లి 48 పాయింట్ కాలువ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, మోతె మండలం కోట్యానాయక్ తండా 36 ఎల్ కాలువ వద్ద ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జలహారతి ఉంటుందని ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.