– సాధన కమిటీ సభ్యుల నిరసన
రామగిరి, ఫిబ్రవరి 24 : గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం డబుల్ బెడ్రూం ఇండ్ల సాధన కమిటీ సభ్యులు డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2017లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసినప్పటికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వక లబ్ధిదారులకు స్వాధీన పరచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వం లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పేర్లు ప్రకటించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వలేకపోయిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిందని 2024 డిసెంబర్ నుండి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక రూపాలలో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరేట్ ముందు, పెద్ద గడియారం సెంటర్లో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినట్లు చెప్పారు. మంత్రి వెంకట్ రెడ్డి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కిరాయి ఇండ్లలో ఉంటూ ఇంటి అద్దెలు కట్టుకోలేక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేసి స్వాధీన పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ సభ్యులు గంజి రాజేశ్, ఆవుల అనురాధ, సిరాజుద్దీన్, గిరిజ, గౌసియా, విజయలక్ష్మి, పగిళ్ల జయమ్మ, వెంకటమ్మ, జానీ బి పాల్గొన్నారు.