హైదరాబాద్ : ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్ (CM KCR) అర్చకులకు (Priests) ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడించారు.
బుధవారం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అర్చకులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అలవెన్సును జీవో (Government Order) జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయాలను అభివృద్ధి (Temples Development) చేయడానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అర్చకుల ఆశీర్వచనాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాక్షించారు. గత జూన్ నెలలో రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం అర్చకులపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప, నైవేద్యం అలవెన్స్(Allowance)ను రూ.10వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 793 ,రాష్ట్ర వ్యాప్తంగా 6,541 దేవాలయాలకు ప్రయోజనం చేకూరనున్నదని మంత్రి వెల్లడించారు.