గుర్రంపోడు, జూన్ 17 : నల్లగొండ జిల్లా గుర్రంపోడు సమీపంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం చేశారు. ఎల్లమోనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జింకల అఖిలకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అత్యవసర సేవలను ఆశ్రయించారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుర్రంపోడు వద్దకు రాగానే నొప్పులు తీవ్రమయ్యాయి. పరిస్థితిని గమనించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వెలుగు సత్యనారాయణ వెంటనే అంబులెన్స్ను పక్కకు ఆపి తన వైద్య నైపుణ్యంతో అంబులెన్స్లోనే సుఖ ప్రసవం చేశారు.
ఈ ప్రసవంలో అఖిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అత్యవసర సమయంలో దేవుడిలా ప్రాణాలు కాపాడినందుకు వెలుగు సత్యనారాయణ, పైలట్ శ్రీనులకు అఖిల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బందిని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం, నల్లగొండ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ప్రశంసించారు.