– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, జులై 01 : వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 34వ వార్డు పరిధిలో గల ఎర్రకుంట వాగు కాలువ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ రమాదేవి, స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడు వరద నీరు సాఫీగా సాగిపోయేలా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల్లో ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా, నీరు నిలవకుండా పకడ్బందీగా పనులు జరగాలన్నారు. కాంట్రాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.