హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆంజనేయ స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీలు తీశారు. చిట్యాల మండలం వెలిమినేడులోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి.. తన సతీమణి సునీత, తనయుడు వేమన్రెడ్డితో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 వెండి తమలపాకుల హారాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
చిట్యాల, మే 14 : హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వెల్మినేడు ఆంజనేయ స్వామికి 108 వెండి తమలపాకుల హారాన్ని సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి దంపతులతోపాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, కొలను వెంకటేశ్, కల్లూరి మల్లారెడ్డి, కూరెళ్ల లింగస్వామి, దేవరపల్లి సత్తిరెడ్డి, మత్స్యేందర్, గుత్తా యువసేన అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చిట్యాల కనకదుర్గ ఆలయం చైర్మన్ శీలా సత్యనారాయణ, నాగరాజురెడ్డి, రాజు పాల్గొన్నారు.