పదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత ప్రగతి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో అందరి కడుపు నింపుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. అభివృద్ధి నిరోధక పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 28 : ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమాలతో అందరి కడుపునింపుతున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజలను కోరారు. ఈ 30న జరిగే ఎన్నికల్లో నియోజక వర్గంలోని పోలింగ్ బూత్ల్లోని రెండు బ్యాలెట్లలో మనది ఒకటో నంబర్ కారు అని ప్రజలందరి వేలు అభివృద్ధికి చిరునామాగా మారిన కారు గుర్తుపైనే ఉండాలన్నారు. విపక్షాల మాయమాటలకు మోసపోతే గోస పడుతామన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా బుధవారం మంత్రి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు.
సూర్యాపేట వీధులన్నీ జనసంద్రంతో గులాబీమయంగా మారాయి. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, యువతతో రోడ్ షో ఫుల్ జోష్గా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి పదేండ్ల ప్రశాంత పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించుకుని సూర్యాపేటను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సూర్యాపేటను జిల్లాగా మార్చుకున్నామని, మెడికల్ కళాశాల, రెండు ట్యాంక్బండ్లు, వైకుంఠ ధామాలు, మహాప్రస్థానం, పార్కుల పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంపు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అలాగే సూర్యాపేట ప్రజలకు మూసీ మురికినీటి పీడను వదలించి మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను అందిస్తూ అందరి దాహార్తిని తీర్చినట్లు వివరించారు. ప్రధానంగా 2014కు ముందు ఉన్న సిండికేట్ దందాలను, రౌడీ రాజకీయాలను రూపుమాపి ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి వెలుగులు నింపామని తెలిపారు. దాంతో నేడు ప్రజలంతా ఐక్యతతో ఆనందంగా జీవిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రజలను దోచుకోవడమే తప్ప ఏమాత్రం అభివృద్ధి పట్టదని, అటువంటి అరాచక పార్టీలకు ఓటుతో ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలన్నారు.
ఈ 30న ప్రజలంతా కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాలను మరింత పెంచుకుంటూ అనందంగా జీవిద్దామని పేర్కొన్నారు. రోడ్ షోలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు డాక్టర్ రామ్మూర్తియాదవ్, మొరిశెట్టి శ్రీను, గండూరి ప్రకాశ్, బీరవోలు శ్రీహర్ష, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్/చివ్వెంల : సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిన పనితనం తమదైతే అమాయకులను కేసుల పాలు చేసిన రాజ్యం దామోదర్రెడ్డిదని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎండ్లపల్లి, హనుమనాయక్తండా, టేకుమట్ల, పిల్లలమర్రి, దాసాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కారు గుర్తుకు ఓటు వేస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తే, కాంగ్రెస్కు వేసే ఓటుతో చీకట్లు వస్తాయని తెలిపారు. పదేండ్ల దామోదర్రెడ్డి పాలనలో సూర్యాపేట ఆగం అయిందన్నారు. ఆరుసార్లు సార్లు అవకాశం ఇస్తే పనులు చేయనోళ్లు ఇప్పుడు చేస్తారా అని మంత్రి పశ్నించారు. మూసీ గేటుకు రంధ్రం పడి నీరు వృథాగా పోయి పొలాలు ఎండిపోతుంటే రిపేర్ చేయాలనే సోయి కూడా ఆనాడు దామోదర్రెడ్డికి లేదన్నారు.
2014లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మూసీ గేట్లను రిపేర్ చేసి వరుసగా 18 పంటలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు. మూసీపై చెక్డ్యామ్ నిర్మాణం మత్స్యకారులకు వరంగా మారినట్లు చెప్పారు. పేదల కడుపు చూసే నాయకుడు సీఎం కేసీఆర్ అన్న మంత్రి కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కాటు కలుస్తది.. రైతు జీవితం ఆగమైతదన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలమర్రి, ఉండ్రుగొండ, లింగమంతులస్వామి గుట్టలు, మూసీ ప్రాజెక్ట్ల సమాహారంతో సూర్యాపేటను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్ట్లో బోట్హౌజుల ఏర్పాటుతో పర్యాటక స్వర్గధామంగా చేస్తానని తెలిపారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాబోయే పాలన ఉంటుందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, పుష్కలంగా సాగునీరు, వెలుగు జిలుగుల కరెంట్, సుందర రహదారులు ఇలా ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చినట్లు తెలిపారు. మళ్లీ ఆశీర్వదిస్తే సూర్యాపేటకు వెయ్యి ఎకరాల్లో డ్రైపోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పరిశ్రమను విస్తరించి 20 వేల మందికి పైగా యువతీయువకులకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. ఆశీర్వదించండి..ఓటు వేసిన వారు గర్వపడేలా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.