కట్టంగూర్, సెప్టెంబర్ 29 : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శుక్రవారం ఆయన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రతిరోజూ వెంటపడి అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్టు ఏర్పాటు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తెలపడంతో రూ.100 కోట్లు మం జూరయ్యాయని తెలిపారు. మూడు నెలల్లోనే లిఫ్టు పనులు పూర్తి చేసి 8వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.
లిఫ్టు ఇరిగేషన్ కోసం రాత్రీ పగలు వెం ట పడి మంజూరు చేయించడంతో పాటు, పూర్తి చేయించేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మీరందరూ ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రైతాంగానికి సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్టు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ లిఫ్టు ఏర్పాటుతో మూడు మండలాల్లోని 11గ్రామాల్లో సుమారు 8వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందన్నారు. 6నెలల్లో పనులు పూర్తి చేసి వ్యవసాయ రంగానికి నీరు అందిస్తామని హామీనిచ్చారు. లిఫ్టు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు తనతో పాటు ఈ ప్రాంత రైతులు రుణపడి ఉంటారని తెలిపారు.