యాదాద్రి భువనగిరి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : చెట్టు, పుట్ట.. గుడి, బడి.. చేను, చెల్క.. జాగా, ఇల్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఊరు ఊరంతా నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఇండ్లు, వ్యవసాయ భూములను ఉన్నపళంగా పీవోబీలో పొందుపరిచారు. వడాయిగూడెం గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న వాటిని సైతం 22-ఏ జాబితాలో పెట్టారు. ఫలితంగా క్రయవిక్రయాలకు వీలు లేకుండా పోయింది. దీంతో గ్రామ ప్రజలంతా లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామం.. లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట పట్టణాన్ని ఆనుకొని ఉంటుంది. గ్రామంలో సుమారు 1200 మంది జనాభా ఉన్నది. గ్రామంలో సర్వే నంబర్ 518లో మొత్తం 349 ఇంటి నంబర్లు ఉన్నాయి. వీటిల్లో 336 నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు అంతా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే దశాబ్దాలుగా నివాసముంటున్నారు. వీటితోపాటు బొడ్రాయి, పోచమ్మ గుడి, హనుమాన్ ఆలయం, మహిళా భవనం, పీడబ్ల్యూఎస్ బోరు మోటార్, పీర్ల కొట్టం, వాటర్ ఫిల్టర్ రూమ్, ఉప్పలమ్మ, దుర్గమ్మ, బుగ్గ పోచమ్మ ఆలయాలు, ప్రాథమిక పాఠశాలు, ఎల్లమ్మ ఆలయం, అంగన్వాడీ స్కూల్ ఉంది. అటు సొంత ఇండ్లతోపాటు ఇటు గ్రామంలోని గుడులు, బడులు, ప్రభుత్వ భవనాలు సైతం నిషేధిత జాబితాలో చేర్చారు.
గ్రామంలో మొత్తం 467 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రైతులు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. ఈ మొత్తం 467 ఎకరాలు సైతం పీవోబీలో పొందుపరిచారు. వాస్తవానికి గ్రామంలో కేవలం 20 ఎకరాలు మాత్రమే భూదాన్ భూములు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇన్ని రోజులు లేనిదీ ఇప్పుడు కొత్తగా పీవోబీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై వడాయిగూడెం గ్రామ కార్యదర్శి ఆమనిని వివరణ కోరగా, భూదాన్ భూముల కేసు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఊరంతా పీవోబీలో చేర్చారని స్పష్టం చేశారు.
ఈ గ్రామ ప్రజలంతా సుమారు 80 నుంచి 90 ఏండ్ల నుంచి ఇక్కడే నివాసముంటున్నారు. ఇండ్లు కట్టుకొని, ఇంటి నంబర్లు తీసుకున్నారు. నెలనెలా పన్నులు కూడా చెల్లిస్తున్నారు. విద్యుత్, నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు రుణాలు కూడా పొందారు. అవసరం ఉన్నప్పుడు అమ్ముకున్నారు. కొనుక్కున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి దగ్గరగా ఉండటంతో పాటు భూములకు మంచి డిమాండ్ ఉండటంతో అనేక మంది ఇతరుల నుంచి వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. ఇలా చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ప్లాట్లు కొనుక్కున్నారు. స్థానికంగా ఉన్నోళ్లు అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. కానీ జనవరిలో పీవోబీలో చేర్చడంలో క్రయవిక్రయాలు పూర్తి నిలిచిపోయాయి. ఇండ్లు రిజిస్ట్రేషన్ కావడంలేదు. అవసరానికి అమ్మలేని పరిస్థితి. వ్యవసాయ భూములకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు అగ్గిమీద గుగ్గి లం అవుతున్నారు. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని సైతం కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయి నేతలను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీవోబీలో నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వడాయిగూడెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 518లో దశాబ్దాలుగా నిర్మించుకున్న నివాస గృహాలను నిషేధిత జాబితాలో పెట్టడం సరికాదు. వ్యవసాయం భూములను పైతం ఆ జాబితాలో పెట్టడం ఎంత వరకు సబబు. కేవలం 20 ఎకరాలు భూదాన్ భూములు ఉంటే.. మొత్తానికి మొత్తం ఊరంతా 22-ఏలో ఎలా పెడతారు..? వెంటనే నిషేధిత జాబితా నుంచి గ్రామాన్ని మినహాయించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.