తిరుమలగిరి, ఏప్రిల్ 20 : సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది.
ఇప్పుడు మండే ఎండల్లో సైతం చెరువులు, కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. గోదావరి జలాలతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.199,41 కోట్లతో 535 చెరువుల మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో తిరుమలగిరి పెద్ద చెరువు కింద 75 ఎకరాలు కూడా సక్రమంగా పారేది కాదు. ఇప్పుడు 150 ఎకరాలకు పైగా సాగవుతున్నది. గోరెంట్ల చింతల చెరువు ద్వారా గతంలో 70ఎకరాలకు నీరందేది. ప్రస్తుతం 120 ఎకరాలు పారుతున్నది. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది.
ఎక్కడ చూసినా నీళ్లు ఫుల్లు
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఎవుసాయానికి ఢోకా లేదు. అప్పుడు ఒక్క మడికి కూడా నీళ్లు పారేది కాదు. బోరు పది నిమిషాలు ఆగితే ఒక్క బిందె నీళ్లు పోసేది. దాంతో ఎవుసాయం పడావుపడి నానా కష్టాలు పడ్డం. ఇప్పుడు చెరువులు, కుంటలల్ల నిండుగా నీళ్లు కనిపిస్తున్నయి. ఎండకాలంలో కూడా కాల్వల్లో నీళ్లు పారుతున్నయి. ఎనుకటి రోజులు మళ్లా గుర్తుకొస్తున్నయ్. సీఎం కేసీఆర్తోనే రైతుల కష్టాలు తీరినయ్. ఎవరు వచ్చినా దండుగే. కేసీఆర్ సార్ లెక్క చేయలేరు.
– బాలూనాయక్, రైతు, మొండిచింత తండా, తిరుమలగిరి మండలం
కాల్వ నీళ్లతో సాగు పెరిగింది
మండలంలో గతంతో పోల్చితే ఆయకట్టు రెట్టింపు అయ్యింది. గోదావరి జలాలతో సాగునీరు సమృద్ధిగా అందుతుంది. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. నాడు వానకాలంలో ఎండిన బావులు.. నేడు ఎండల్లో సైతం నిండుగా దర్శనమిస్తున్నాయి. చెరువులు, కుంటల కింద సాగు బాగా పెరిగింది. గుంట భూమి కూడా ఖాళీగా లేదు. – అనంతుల వెంకన్న, రైతు, నాగారం