ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నియోజకవర్గం పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామగ్రిని తీసుకుని బయల్దేరుతారు. ఆదివారం సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేక రూట్లుగా విభజించి వాహనాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది సోమవారం ఉదయం 6గంటలకే సిద్ధంగా ఉండనున్నారు.
ఉదయం 8నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను తిరిగి ముందుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలకు తీసుకొస్తారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య అన్ని జిల్లా కేంద్రాల నుంచి నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలించి భద్రపరుస్తారు. వచ్చే నెల 5న ఓట్ల లెక్కింపు జరుగనుంది. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య 52 ఉండడంతో అందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను, ఇతర సామగ్రిని ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరవేశారు.