రామగిరి, ఆగస్టు 7: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష ముగిశాక ట్రాఫిక్ సమస్య లేకుండా పర్యవేక్షించారు. నల్లగొండ జిల్లాలో 13,307 మంది అభ్యర్థులకుగాను 12,620 మంది పరీక్షకు హాజరుకాగా 678 మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూ సంయుక్తంగా నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలను పలువురు అధికారులు పర్యవేక్షించారు. జేఎన్టీయూ ఓఎస్డీ డాక్టర్ ధర్మానాయక్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాంతో కలిసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్జీ కళాశాలతోపాటు పలు పరీక్షా కేంద్రాలను ఎస్పీ రెమా రాజేశ్వరీ తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు. వారితోపాటు రీజినల్ కోఆర్డినేటర్స్ నాగరాజు, చంద్రశేఖర్, వెంకటరమణ పర్యవేక్షించారు.
జిల్లాలో అభ్యర్థుల హాజరు ఇలా..
– జిల్లా వ్యాప్తంగా 13,307 మంది అభ్యర్థులకుగాను 12, 620మంది హాజరుకాగా 687మంది గైర్హాజరయ్యారు.
– నల్లగొండ రీజియన్ కోఆర్డినేటర్ -1 పరిధిలో 7,356 మందికిగాను 7,109 మంది పరీక్ష రాయగా 247మంది గైర్హాజ రయ్యారు.
– నల్లగొండ రీజియన్ కోఆర్డినేటర్ -2 పరిధిలో 3492 మందికి 3159 మంది హాజరుకాగా 333మంది గైర్హాజరయ్యారు.
– మిర్యాలగూడ రీజియన్ కోఆర్డినేటర్ -3 పరిధిలో 2,459 మందికిగాను 2,352 మంది హాజరుకాగా 107 మంది గైర్హాజర య్యారు.
మిర్యాలగూడలో…
పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష సజావుగా ముగిసింది. పట్టణంలో మినా ఇంజనీరింగ్ కళాశాల, అభ్యాస్, చైతన్య, ఆర్యన్ టెక్నో, కాకతీయ పాఠశాలలు, నాగార్జున డిగ్రీ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను డీఎస్పీ వెంకటేశ్వర్రావు సందర్శించారు. మొత్తం 2,459 మంది అభ్యర్థులకు గాను 2,352 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. 107 మంది గైర్హాజరయ్యారు.