సూర్యాపేట టౌన్, డిసెంబర్ 10 : ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల విధుల నిర్వహణపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు కేటాయించిన విధులు, ప్రాంతాలను వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్దతిలో ఉంచాలని సూచించారు. అనుమతిలేని వ్యక్తులను, ఓటరు కానీ వారిని పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి రానివ్వొద్దన్నారు.
100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తులు ఏమైనా వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Suryapet Town : ఎన్నికల విధుల పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ నరసింహ