ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులకు గురువారం నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 4 వరకు జరిగే ఈవెంట్స్కు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన 26,433 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ 1200 మందికి ఈవెంట్స్ నిర్వహించడంతోపాటు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరుగుపందెం, షాట్పుట్, లాంగ్జంప్, హైజంప్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు బయో మెట్రిక్ ద్వారా హాజరును తీసుకోనున్నారు. అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగనున్నది. ఎవరి మాయమాటలు నమ్మొద్దని ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని నల్లగొండ,
సూర్యాపేట ఎస్పీలు రెమా రాజేశ్వరి, రాజేంద్రప్రసాద్ అభ్యర్థులకు సూచించారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకై అర్హత సాధించిన 26,433 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిపికేషన్తోపాటు దేహదారుఢ్య పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో 21,395 మంది పురుషులు, 4,830 మంది మహిళలు, 208 మంది ఇతర అభ్యర్థులు(గిరిజనులు, ఆర్మీ) ఉన్నారు.
నేటి నుంచి జనవరి 4 వరకు…
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుని ప్రిలిమ్స్లోఅర్హత సాధించిన అభ్యర్థులకు నేటి నుంచి జనవరి 4వరకు నిర్విరామంగా జిల్లా పోలీస్ యంత్రాంగం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో పురుషులు, స్త్రీలకు సర్టిఫికెట్ల వెరిపికేషన్తోపాటు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఉదయం 4.30 గంటలకే గ్రౌండ్కు చేరుకోవాల్సిన అవసరం ఉంది. పురుషులకు 1,600, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్, లాంగ్జంప్ లాంటి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. గురువారం 600 మంది, శుక్రవారం 800 మందికి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ప్రతి రోజూ 1200 మంది చొప్పున పాల్గొనేలా బ్యాచ్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఇప్పటికే పలువురు అభ్యర్థులతో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు.
ఈవెంట్స్లో అర్హత సాధిస్తే మెయిన్స్కు…
ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్(రాత పరీక్ష)రే అవకాశం కల్పించనున్నారు. అందులోనూ ప్రతిభ కనబర్చిన వారికి పోలీస్ ఉద్యోగం దక్కనుంది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా దేహదారుఢ్య పరీక్షలు జరిగే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశారు. ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగనున్నది. ప్రతి అంశం హైటెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, అక్రమాలు జరిగాయన్న విమర్శలకు తావులేకుండా ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) ద్వారా నిర్వహించనున్నారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో…
ఈవెంట్స్లో ఎలాంటి అవకతవకలు జరుగొద్దనే ఉద్దేశంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఈవెంట్ వద్ద బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయడంతో పాటు ఆర్ఎఫ్ఐడీ డిజిటల్ విధానం ద్వారా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తూ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి అంశం హైటెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడ మానవ ప్రమేయం లేకుండా, అక్రమాలు జరుగకుండా, విమర్శలకు తావులేకుండా ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) ద్వారా నిర్వహించనున్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డు కానున్నది. భవిష్యత్లో ఏమైనా విమర్శలు వస్తే సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే వారిని గ్రౌండ్లోకి పంపించేందుకు ఉదయం 4:30గంటలకే రావాలని పోలీస్ శాఖ సూచించినప్పటికీ 6 గంటల వరకు సమయమిచ్చి ఆ తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీస్ యంత్రాంగం
పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసింది. దళారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పారదర్శకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆర్ఎఫ్ఐడీ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం జేఎన్టీయూకు సంబంధించిన సిబ్బందితో పాటు పోలీస్ శాఖ సిబ్బందికి సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చి పర్యవేక్షణ చేయిస్తున్నారు. బయోమెట్రిక్ మిషన్లలో తేడా వస్తే మ్యానువల్గా కూడా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను అనుమతించే ప్రాంతాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసి వారికి టోకెన్లు ఇచ్చి క్రమ పద్ధతిలో ఈవెంట్స్కు పంపనున్నారు. ఈ పరీక్షలు ఈ-సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ వారి డిజిటల్ మిషన్ల ద్వారా జరుగనున్నందున ఆర్ఎఫ్ఐడీఎస్, డిజిటల్ మిషనరీల ద్వారా జరిగే పరీక్షల రీడింగ్స్ నేరుగా ఉన్నతాధికారులకు చేరనున్నాయి.
ఇవి తప్పనిసరి
దళారుల మాటలు నమ్మొద్దు
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్తోపాటు దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహించనున్నాం. హాజరైన దగ్గరి నుంచి పూర్తయ్యే వరకూ గ్రౌండ్లోనే అందుబాటులో ఉండాలి. ఈవెంట్స్లో ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావు లేకుండా దేహదారుఢ్య పరీక్షలు జరిగే మొత్తం ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశాం. దళారుల మాయమాటలు నమ్మొద్దు. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా ఉద్యోగం వచ్చేలా సాయం చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దు.
-రెమా రాజేశ్వరి, ఎస్పీ, నల్లగొండ
అభ్యర్థులు ఒత్తిడికి గురికావద్దు
అభ్యర్థులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం సాధించవచ్చు. ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రాష్ట్ర పోలీస్ నియామక మండలి జారీ చేసిన అనుమతి సమాచార పత్రంతో చూపిన తేదీల్లో దేహదారుఢ్య పరీక్షల కేంద్రానికి సరైన సమయానికి హాజరు కావాలి. ఈ పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయి. ఇతరుల మాయమాటలు నమ్మవద్దు. పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుంది. రాష్ట్ర నియామక మండలి జారీ చేసిన అనుమతి పత్రంలో చూపిన సూచనలు, నిబంధనలు తప్పకుండా పాటించాలి.
-రాజేంద్రప్రసాద్, ఎస్పీ, సూర్యాపేట