నేరేడుచర్ల, మే 28 : మన రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట సుమారు 20వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నది. పొద్దు తిరుగుడు నూనెలో(49%) మాంసకృత్తులు, లినోలిక్ ఆమ్లం(66%) ఉంటాయి. ఈ నూనె వనస్పతి తయారీ, వార్నిశ్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీశాక వచ్చిన పిప్పిలో అధికంగా మాంసకృత్తులు(21%) ఉంటాయి. దీన్ని పశువులు, కోళ్ల దాణాగా పలుచోట్ల వాడుతున్నారు. ఇంత ఉపయోగకరమైన పొద్దు తిరుగుడు పంటను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, డిండి ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ సాగు చేసి యాజమాన్య పద్ధతులు పాటించడంతో మంచి ఫలితాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని సాగులో పాటించాల్సిన విధానాలను గురించి వారు తెలిపిన వివరాలు …
అనువైన నేలలు : నీరు నిల్వ ఉండే తటస్తు భూములైన ఎర్ర చల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు సాగుకు శ్రేష్టం. అధికారుల సూచనల ప్రకారం 6.6- 8.0 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనవి.
అనువైన పరిస్ధితులు : ఈ పంట సాగుకు 20-25డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 12 గంటల పగటి సమయం అనువైనది. వర్షాధారపు పంట కాలంలో 500- 750మి.మీ వర్షపాతం సమానంగా విస్తరించి పూత, గింజ గట్టిపడే దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు. నీటి పారుదల కింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే పూత, గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. రబీలో విత్తిన పంట ఖరీఫ్ పంట కంటే అధిక దిగుబడి వస్తుంది.
నేల తయారీ : భూమిని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో ఒకటి రెండు సార్లు కలియదున్ని తర్వాత చదును చేసి ఆ తర్వాత విత్తుకోవాలి.
విత్తే సమయం : ఖరీఫ్లో తేలకపాటి నేలల్లో జూన్ రెండో వారం నుంచి జూలై 15వరకు, బరువు నేలలో ఆగస్టు రెండో వారంలో విత్తడానికి సరైన సమయం. రబీలో నవంబర్- డిసెంబర్, వేసవిలో నీటి పారుదల కింద జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. వరి తర్వాత పొద్దు తిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవాలి. విత్తే సమయం సైతం నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు (12గంటలు ), సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది.
విత్తన మోతాదు : ఎకరాకు 2కిలోల విత్తునం సరిపోతుంది. నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి విత్తుకోవాలి.
విత్తనాలు నానబెట్టుట : ఈ పద్ధతి వర్షాధార పరిస్థితుల్లో త్వరితగతిన విత్తనం మొలకెత్తుటకు, ఆశించిన మొక్కల సాంద్రత పొందుటకు
దోహదపడుతుంది. లీటరు నీటికి కిలో విత్తనం చొప్పున 14గంటల సేపు మంచి నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలకశాతం పెరుగుతుంది.
విత్తన శుద్ధి : ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్(ఇప్రోడియోన్ 25%+ కార్బండిజిమ్ 25%) అనే మందును 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేయాలి. నెక్సోసిన్ వైరస్ అధికంగా వున్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి దయోమిధాక్సమ్ 4 గ్రాముల మందును లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 5.0 గ్రాములతో విత్తనశుద్ధి చేయాలి.
విత్తే పద్ధతి : బోదెలు చేసి విత్తనం నాటితే పంట కాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వటానికి పైపాటుగా ఎరువులు వేయటానికి గాకుండా మొక్కలకు తగిన పటుత్వం లభిస్తుంది.
విత్తే దూరం : సరైన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావాల్సిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చు. తేలిక నేలలో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ, బరువు నేలల్లో వరుసల మధ్య 60సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేటట్లు కుదురుకు 2-3 విత్తనాలు నాటాలి.
పలుచన చేయుట : విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. దీంతో నీరు, పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.
అంతర పంటలు : దీనిని ఏక పంటగాను లేదా వేరుశనగ+పొద్దుతిరుగుడు 4ః2, కంది+పొద్దుతిరుగు 1ః2 పైర్ల అతర పంటగా పండించుకోవచ్చు.
పంట మార్పిడి : చిదుధాన్యాలు (కొర్ర, జొన్న, సజ్జ), అపరాలు (కంది, శనగ, మినుము) వేరుశనగ మొదులగు పంటలతో పంట మార్పిడి చేయవచ్చు.
ఎరువులు : ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును విత్తే 2-3వారాల ముందు వేయాలి. భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేయబడిన
మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్తం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏ మాత్రం తగ్గవు.
నీటి యాజమాన్యం : వాతావరణాన్ని బట్టి ఎర్ర నేలల్లో 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్ల రేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి.
దిగుబడి : ఎకరాకు సుమారు వర్షాధారం కింద 400 కిలోలు, నిశ్చిత వర్షపాత పరిస్థితుల్లో 400- 600 కిలోలు శీతాకాలం లేదా వేసవిలో నీటి పారుదల కింద 800- 1000 కిలోలు దిగుబడిన సాధించవచ్చు.
చిన్న చిన్న మెలకువలతో మంచి ఫలితాలు
పొద్దు తిరుగుడు సాగులో చిన్న, చిన్న మెలకువలు పాటి ంచి మంచి ఫలితాలను సాధించవచ్చు. అనువైన నేలల్లో సమయానుకూలంగా విత్తుకోవాలి. నీటిని సాలు, సాలుకు పెట్టుకుంటే పొదుపుగా వాడుకోవచ్చు. తగిన మోతాదులో ఎరువులు వేస్తూ, రోగ లక్షణాలను బట్టి మందులను పిచికారి చేస్తే ఆశించిన పలితాలు పొందవచ్చు.
– డి.నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి