నల్లగొండ, జూన్ 5 : ఆలోచన ఉంటే పెట్టుబడి లేదు..పెట్టుబడి ఉంటే ఆలోచన లేదు..రెండూ ఉంటే నెలల తరబడి తిరిగినా అనుమతి వచ్చేది కాదు..ఇది 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగ పరిస్థితి. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ,స్వయం ధృవీకరణ వ్యవస్థ్ధ) పారిశ్రామిక ఔత్సాహికుల్లో కొత్త ఉత్సా హం నింపింది. జిల్లాలో 2014కు పూర్వం 2,801 పరిశ్రమలు ఉండగా ఈ తొమ్మిదేండ్ల కాల ంలో 606పరిశ్రమలు స్థ్దాపించబడి పురోగతిలోకి వచ్చాయి. ఇక పెట్టుబడులు గతంలో జిల్లా వ్యాప్త ంగా ఆయా పరిశ్రమలకు రూ.8,699 కోట్లు పెడితే 2014 తర్వాత రూ.28 565 కోట్లు పెట్టుబడింది. ఈ పరిశ్రమలతో 18,924 మందికి ఉపాధి పొందుతుండగా స్థానికులతో పాటు ఇతర రాష్ర్టాల వచ్చే వేల మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది.
టీఎస్ ఐపాస్తో అనుమతులు
సాధారణంగా ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే వివిధ శాఖల నుంచి మొత్తంగా 27 శాఖల ద్వారా అనుమతులు తీసుకోవాలి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆయా శాఖల ద్వారా అనుమతి తీసుకోవడానికి నేరుగా అక్కడికి వెళ్లి రుసుం చెల్లించి అనుమతి తీసుకునే వారు. ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టేది. అయితే రాష్ట్రం ఏర్పడిన పరిశ్రమల స్థాపన పెరగాలని భావించి సర్కార్ టీఎస్ ఐపాస్ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా పది పేజీల ధృవ పత్రాలను ఆన్లైన్లో టీఎస్ ఐపాస్ సైట్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో అన్ని అనుమతులు వస్తున్నాయి. పైగా ప్రాజెక్టును బట్టి ప్రభుత్వం రాయితీ సైతం అందజేస్తున్నది. పక్కా ఆలోచన ఉన్న పారిశ్రామిక వేత్తలకు సైతం ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి పరిశ్రమను మంజూరు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో పరిశ్రమలు విరివిగా విస్తరించాయి.
నీటి వినియోగంలో పది శాతం వాటా పరిశ్రమలకే..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల్లో రావాల్సిన వాటి ప్రతి సీజన్లో ప్రభుత్వం కృష్ణాబోర్డుతో కొట్లాడి జిల్లాకు రావాల్సిన నీటిని విడుదల చేస్తుంది. పరిశ్రమలకు సైతం నీటి వాటాలో ప్రభుత్వం పది శాతం అందచేస్తున్నది. రైస్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా అన్ని పరిశ్రమలకు 10శాతం చొప్పున నీటి కేటాయించడంతో నీటి సమస్య లేకుండా పోయింది. విద్యుత్ , నీటి సమస్య లేకండా పోవడంతో జిల్లాలో రైస్ ఇండస్ట్రీస్ బాగా పెరగడం వల్ల ఒడిశా, ఛత్తీస్గడ్, బిహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారు.
టీ ఐడియా, టీ ఫ్రైడ్ ద్వారా రాయితీలు..
రాష్ర్టాన్ని అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి రూపొందించిన పథకమే (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అబివృద్థి పథకం)టీ ఐడియా. ఈ పథకం ద్వారా కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేవారికి పెట్టుబడితో పాటు స్టాంప్, ట్రాన్స్ఫర్ డ్యూటీ, పావలా వడ్డీ, అమ్మకపు పన్ను, విద్యుత్ వినియోగం, భూమి కొనుగోలు, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సర్కార్ రాయితీలను ఇస్తున్నది. మహిళా పారిశ్రామి వేత్తలకు ప్రత్యేక రాయితీలు సైతం అందజేస్తున్నది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 984 మంది నుంచి దరఖాస్తులు రాగా వారికి రూ.205.15 కోట్ల రాయితీ అందజేసింది. ఇక టీ ఫ్రైడ్ (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు దివ్యాంగుల సమగ్రాభివృద్ధి కోసం రూపొందించబడిన పథకం) కింద ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు సాధారణ రాయితీలతో ప్రత్యేక రాయితీలను అందజేస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద జిల్లాలో 7,868 మంది దరఖాస్తులు రాగా వారికి రూ.269.23 కోట్ల రాయితీలు అందచేశారు.
ఐటీ హబ్, థర్మల్ ప్లాంట్లలో యువతకు కొలువులు..
టీఎస్ ఐపాస్తో పరిశ్రమల అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం తెలంగాణ హబ్ (టీ హబ్), ఉమన్ హబ్(వీ హబ్) పేరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఇందులో భాగంగా నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాలలో రూ.110 కోట్ల వ్యయంతో ఐటీ పార్కు నిర్మించింది. ఇక్కడ ప్రభుత్వం తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఏడు కంపెనీలు తమ కార్యకలాపాల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో ప్రస్తుతం 1,600మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయా కంపెనీలు ప్రకటించాయి. దామరచర్లలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇప్పటికే 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.
జిల్లాలో విస్తరించిన పరిశ్రమలు.. పెరిగిన పెట్టుబడులు..
టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత పరిశ్రమలు విస్తరించడంతో పాటు పెట్టుబడుల సైతం బాగా పెరిగి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వేల మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రం ఏర్పడక ముందు 2,801 పరిశ్రమలు ఉండగా 2014 తర్వాత 606 (22 శాతం) పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. అయితే పెట్టుబడుల విషయంలో గతంలో జిల్లాలో ఆయా పరిశ్రమల్లో మొత్తంగా రూ.8,699.08 కోట్లు పెట్టగా ఈ తొమ్మిదేండ్లలో రూ.28,565 పెట్టుబడులు వచ్చాయి. అంటే ఈ తొమ్మిదేండ్లలో జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ పరిశ్రమలు గత పరిశ్రమలతో పోలిస్తే 328 శాతం వృద్ధి చెందింది. ఇవి ఆధునీకరించిన పరిశ్రమలు కావడంతో రానున్న కాలంలో మరింత ఉపయోగ పడనున్నాయి. ఇక ఉపాధి గతంలో 31,983 మందికి లభించగా తాజాగా ఈ దశాబ్దంలోనే 18,924 మందికి కల్పించబడుతుంది. ధాన్యాగారమైన నల్లగొండలో ఈ దశాబ్దం కాలంలో వరి సాగును దృష్టిలో పెట్టుకొని అనేక రైస్ ఇండస్ట్రీస్ ఏర్పడగా వాటికి సైతం 30 రోజుల్లోనే అనుమతి వస్తుంది. రూ.100 కోట్లతో అనుములలో పెట్టుబడి పెట్టి నిర్మించిన వజ్ర తేజ రైస్ మిల్కు సైతం 30 రోజుల్లోనే అనుమతి వచ్చిందంటే టీఎస్ ఐపాస్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం అవుతున్నది.
సూర్యాపేట, జూన్ 5 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పారిశ్రామిక రంగంలో సూర్యాపేట జిల్లా ముందడుగు వేసింది. సిమెంట్ పరిశ్రమలకు నిలయంగా ఉన్న సూర్యాపేట జిల్లాలో అనేక మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు వచ్చి ఉపాధికి మార్గాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా జిల్లాకు 304 కొత్త పరిశ్రమలు, దాదాపు రూ. 5515.87 పెట్టుబడులు వచ్చాయి. దాంతో 10 వేల మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. టీఎస్ ఫ్రైడ్ పథకంలో భాగంగా 5,254 మందికి సుమారు రూ. 220.22 కోట్ల రాయితీ మంజూరు చేశారు. టీ- ఐడియా ద్వారా సుమారు 311 దరఖాస్తులకు రూ. 49.50 కోట్ల రాయితీ ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో యువత
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సింగల్ విండో సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ -ఐపాస్ తీసుకొచ్చి దేశానికే ఆదర్శమైన పారిశ్రామిక విధానాన్ని రూపకల్పన చేశారు. దాంతో పారిశ్రమికంగా సూర్యాపేట జిల్లా ఎంతో ప్రగతిలో ఉంది. ప్రస్తుతం జిల్లాలో 13 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా వాటిలో రూ. 3,329.40 కోట్ల పెట్టుబడి పెట్టారు. వీటి ద్వారా 5 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 778 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ద్వారా మరో 10 వేల మందికి ఉపాధి లభిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తరువాత పరిశ్రామిక విధానంలో తీసుకొచ్చిన కొత్త పాలసీలో అనేక మంది యువతీ, యువకులు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు.
జిల్లాలో 304 పరిశ్రమలు
నిర్ణీత సయమంలో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడానికి దేశంలోనే మొట్టమొదటగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 304 కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దాదాపు రూ. 5515.87 కోట్ల వ్యయంతో వీటిని స్థాపించారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా సుమారు 15 వేల మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ విదానం అమల్లోకి తెచ్చిన తరువాత పరిశ్రమలు పెట్టడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అధికారుల చుట్టూ తిరగకుండా, ఎలాంటి పైరవీలు లేకుండాఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకొనేందుకు వీలు కలుగుతున్నది.
‘టీ-ప్రైడ్’తో 5254 మందికి లబ్ధి
దేశ, విదేశ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పేందుకు అవకాశాలు ఇస్తూనే.. మరోవైపు రాష్ట్రంలోని యువత కోసం పారిశ్రామికరంగంలో సైతం రిజర్వేషన్ల ప్రాతిపదికన వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ-ప్రైడ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులను పారిశ్రామికంగా ప్రొత్సహించేందుకు రాయితీ పథకం అమలు చేస్తున్నది. ఈ విధానం ద్వారా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నెలకొల్పేవారికి రూ.75 లక్షలలోపు ఉన్న పరిశ్రమలకు 35 శాతం సబ్సిడీ, మహిళల యూనిట్ల విలువ రూ.10లక్షలలోపు ఉంటే 10 శాతం రాయితీ, పరిశ్రమల కోసం కొనుగోలు చేసే భూములు, లీజు, భవనాలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100 శాతం రాయితీ అవకాశం కల్పించింది. టీ ఐడియా ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 311 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారికి ప్రభుత్వ దాదాపు రూ.49.50 కోట్ల రాయితీ మంజూరు చేసింది.