యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లో వెల్లడైంది. ఇక ఉమ్మడి జిల్లాలో నల్లగొండ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఈ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 1,38,093గా నమోదైంది. రూ. 1,12,555 తలసరి ఆదాయంతో 16వ స్థానంలో సూర్యాపేట నిలిచింది. రంగారెడ్డి జిల్లా రూ. 4,74,404 తలసరి ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఒక భౌగోళిక ప్రాంతంలో వ్యక్తి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కొలవడమే తలసరి ఆదాయం. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో సగటున వ్యక్తి ఆదాయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ప్రాంతం జీవన నాణ్యతను పరిశీలించడానికి తలసరి ఆదాయాన్ని ఉపయోగిస్తారు.
స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో ఉమ్మడి జిల్లా మంచి మెరుగైన స్థానం సంపాదించింది. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. నల్లగొండ స్థూల జిల్లా దేశీయోత్పత్తి రూ. 26,965 కోట్లుగా నమోదైంది. రూ. 14,889 కోట్లతో పదో స్థానంలో సూర్యాపేట, రూ. 13,587కోట్లతో 14వ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. రూ. 1,44,562 కోట్లతో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది. స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఆ జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మార్కెట్ విలువ. స్థూలంగా దేశీయంగా ఉత్పత్తులను కొలిచే ప్రమాణంగా ఇది ఆ జిల్లా ఆర్థిక పరిపుష్టతను సూచిస్తుంది.