చౌటుప్పల్, జనవరి 16 : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు రేపటి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. పండుగ ముందు రెండు రోజులు 65వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.
తిరుగు ప్రయాణంలో అలాంటి ఇబ్బందులు కలుగకుండా చౌటుప్పల్ పట్టణంలో బస్టాండ్, తంగడపల్లి, వలిగొండ తదితర మార్గాలను మూసివేసేందుకు ట్రయల్స్ వేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువైతే వీటిని మూసివేసి మండలంలోని లక్కారం అండర్ పాస్ బ్రిడ్జి, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం స్టేజీల వద్ద వాహనాలు యూటర్న్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ తక్కువగా ఉంటే యథావిధిగా మార్గాలను తెరువనున్నారు.
దాంతో స్థానిక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయినా.. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దాదావు 70మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. బుధవారం నుంచి విద్యాలయాలు, ఆఫీసులు ఉండటం.. తర్వాత రోజు అన్ని పాఠశాలలు తెరవనుండడంతో ఏపీకి వెళ్లినవారు ఒక్కసారిగా హైదరాబాద్కు వెళ్లనున్నారు. దాంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరుగనుంది. అయితే.. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్లకు గాను హైదరాబాద్ వైవు పదింటిని తెరిచారు.