నీలగిరి, ఫిబ్రవరి 11 : కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి కోరారు. నల్లగొండ ఆయన క్యాంపు కార్యాలయంలో అదివారం ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా ప్రజలు నష్టపోతారని, జంటనగరాలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయని అన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ద్వారా జిల్లాలో ఆరున్నర లక్షలకు పైగా వరి సాగవుతుందని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా 800 నుంచి 875 మెగావాట్ల విద్యుత్ తయారవుతుందని తెలిపారు. తొందరపాటు నిర్ణయంతో ప్రజల ప్రయోజనాలు, హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి తాకట్టుపెట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు అయితగోని స్వామి, చిలుకరాజు శ్రీనివాస్, హరికృష్ణ ఉన్నారు.