సూర్యాపేట టౌన్, ఆగస్టు 17 : 60 ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగం చేసి ఉమ్మడి జిల్లా తమకు కంచుకోటగా ప్రకటించుకున్న కాంగ్రెస్కు మంచుకోటగా కరిగిపోయిందని, అది నేడు బీఆర్ఎస్కు కంచుకోటగా వెలుగొందుతున్నదని పేర్కొన్నారు. 20న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న పలు భవనాలను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని రంగాల ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ చెరుగని ముద్ర వేసుకున్నదని, గులాబీ జెండా నీడలో ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. ఎప్పుడొచ్చినా వరాల జల్లులు కురిపించే సీఎం కేసీఆర్ రాక కోసం సూర్యాపేట ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రగతి నివేదన సభ అనగానే విపక్షాల్లో వణుకు మొదలైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లా.. ఆయన నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
ఇప్పటి వరకు తాత్కాలిక భవనాల్లో పాలన కొనసాగిందని, ఈ నెల 20 నుంచి నూతనంగా అందుబాటులోకి రానున్న జిల్లా కార్యాలయాలు సూర్యాపేట అభివృద్ధికి మరో చిహ్నాలుగా నిలిచి పోనున్నాయని అన్నారు. జిల్లా కేంద్రం నలుదిక్కులా సరికొత్త అందాలతో రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుంటుందన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, గిరిజన గురుకుల పాఠశాల, పార్కును తలపించేలా మహా ప్రస్తానం, రెండు మినీ ట్యాంక్బండ్లు, రోడ్ల విస్తరణ, ఆహ్లాదకరంగా పార్కులు, సెంట్రల్ లైటింగ్తో సూర్యాపేట మరింత సుందరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. 60 ఏండ్లు అన్ని విధాలుగా ఆగమై.. సిండికేట్ దందాలతో నిరంతరం గొడవలు, కొట్లాటలతో భయభ్రాంతుల్లో ఉన్న సూర్యాపేట తొమ్మిదేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.