నిడమనూరు, మార్చి 23 : రెండేండ్లకోసారి జరిగే లింగమంతుల స్వామి జాతరకు ఎర్రబెల్లి గట్టు సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు ఆరాధ్య దైవంగా భావించే దురాజ్పల్లి తర్వాత అతి పెద్ద రెండో జాతరగా ప్రసిద్ధి చెందిన ఎర్రబెల్లి జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదమ్ములుగా పిలువబడే దురాజ్పల్లి లింగమంతుల స్వామికి, ఎర్రబెల్లి లింగమంతుల స్వామికి అవినాభావ సంబంధముండటం ఇక్కడ విశేషం. దురాజ్పల్లిలో జాతర జరిగిన సంవత్సరంలో ఎర్రబెల్లిలో జాతర నిర్వహించకపోవడం, ఎర్రబెల్లిలో జరిగిన ఏడాది దురాజ్పల్లిలో జాతర జరుగకపోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. యాదవ కులస్తుల్లో ఒకరిని తాత్కాలికంగా ఆలయ చైర్మన్గా ఎన్నుకుని జాతర నిర్వహిస్తుంటారు.
శనివారం రాత్రి యాదవులు సంప్రదాయ బద్ధంగా మంద గంపలతో స్వామివారికి ప్రదక్షిణలు చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. 24న తల్లిగంప, సోమవారం తెల్లవారుజామున లింగమంతుల స్వామి, మాణిక్యాలదేవి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 25న యలమంచమ్మకు బోనాలు సమర్పణ, 26న మాణిక్యాలదేవి గొర్రెల మంద ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే గాక కృష్ణా, గుంటూరు, హైదరాబాద్ జిల్లాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రధాన పట్టణాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేశారు. భ క్తులకు ఎండ తగులకుండా మెట్ల మార్గంలో రేకుల తో పైకప్పు నిర్మించామని, తాగునీటి వసతి కల్పించామని ఆలయ చైర్మన్ మసిముక్కు మట్టయ్య తెలిపారు.