యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని ముప్పై మూడు కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన నరసింహ స్వామిని దివ్య విమాన రథంపై ఊరేగే తంతును ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు ఘనంగా చేపట్టారు. ‘ఎదురులేని దొరను ఎదురేగి పిలిచేము’ అంటూ కల్యాణ మూర్తులు రథంలో తరలివస్తుండగా భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు.
అంతకు ముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలి హరణం చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపగ, మల్లిక వంటి పుష్పాలు, చంద్రహారం, ముత్యాలు, మువ్వలు, వగడాలు, వివిధ కంఠాభరణాలతో అలంకరించారు. రథంలోని ఆ పరమాత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. మంగళవాయిద్యాల నడుమ భక్తులు భజనలు, కోలాటాలు వేస్తూ రథం ముందు నడిచారు. జై నారసింహ.. జయ జయ నారసింహ అంటూ భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు.
పాతగుట్ట బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం నిత్యరాధనల అనంతరం చతుర్వేద పారాయణాలు, నిత్య హవనములు, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు, లక్ష్మీ అష్టోత్తర నామ జపములను ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ ఉత్సవ మూర్తులను గరుడ వాహన సేవలో తీరువీధుల్లో ఊరేగించారు.
ఈ వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, యాజ్ఞికులు కిరణ్కుమారాచార్యులు, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణందారులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, వేణగోపాలాచార్యులు, ఆలయ అధికారులు శ్రీకాంత్, విజయకుమార్ పాల్గొన్నారు.
నేడు చక్రతీర్థం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, డోలోత్సవం నిర్వహించనున్నారు.