యాదగిరిగుట్ట, మార్చి 31 : రాష్ట్రంలో రేవంత్ పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువత అరిగోస తీస్తున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కారు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఆ మేరకు ఏప్రిల్ నాలుగున బీఆర్ఎస్ పట్టణ యువజన నాయకులు ముక్యర్ల సతీశ్, ఆవుల సాయియాదవ్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి సుమారు వెయ్యి మంది రైతులు, యువతతో పాదయాత్రగా వెళ్లనున్నట్లు తెలిపారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు చేసి వైకుంఠ ద్వారం వద్ద పాదయాత్రను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ప్రారంభిస్తారని చెప్పారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి నియోజకవర్గంలో ఏర్పడిన కరువు పరిస్థితులు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వివరిస్తామని తెలిపారు. రూ.2 వేల కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రపంచమే అబ్బురపడే విధంగా కేసీఆర్ పునర్నిర్మించారన్నారు. స్వామివారి దివ్య విమానగోపురాన్ని 120 కేజీల బంగారంతో స్వర్ణమయం చేయాలని సంకల్పించి.. కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ మంత్రులు, దాతలు సమారు వంద కిలోల బంగారం సమర్పించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ఈఓ భాస్కర్ కలిసి కేవలం 10 కిలోల బంగారమే వచ్చిందని చెప్పి 50 కిలోల బంగారాన్ని స్వామివారి ఖజానా నిధులను సేకరిం కొనుగోలు చేసి 60 కిలోలతో విమానగోపురాన్ని బంగారు తాపడం చేయించారని తెలిపారు. ఇప్పటి వరకు విరాళాలకు సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదన్నారు.
ఈఓ భాస్కర్ రావు ఒక్కరే వెళ్లి బంగారం కొనుగోలు చేసినట్టు చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట ఆలయం అధ్వానంగా మారిందన్నారు. భక్తులకు పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పీఆర్ వ్యవస్థను ఏర్పాటుచేసి భక్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొండపైన పెండింగ్ ఉన్న 10 శాతం పనులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. బడ్జెట్ లో దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా స్వామివారి ఆదాయాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధ పడుతున్నారని, సాగు నీరు, కరెంటు లేక పంటలు ఎండి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇదే విషయాన్ని కేసీఆర్కు వివరించేందుకు రైతులు, యువతీ యువకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్, బీఆర్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్, నాయకులు కోన్యాల నర్సింహారెడ్డి, గుండ్లపల్లి వెంకటేశ్, అశోక్, శారాజీ రాజేశ్ యాదవ్ పాల్గొన్నారు.