భీమదేవరపల్లి, జూలై 28 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో ‘రాకాసి గుండ్లు’ బయటపడ్డాయి. వీటిని ‘పాండవుల గుండ్లు’, ‘మునిస్వామి గూళ్లు’ అని పిలుస్తారు. వీటిని ‘మెగాలిథిక్ బరియల్స్’ అనికూడా అంటారు. పెద్దరాళ్లతో కట్టిన అతి ప్రాచీన సమాధులు ఇవి. ఇనుపరాతి యుగంలో మనుషులు తమ పూర్వీకులను ఖననంచేసి, చుట్టూ బండరాళ్లు అమర్చేవారు. క్రీ.పూ. 1,200 నుంచి క్రీ.శ. 200వరకు అంటే నేటికి 2,200 నుంచి 3,200ఏళ్ల క్రితం నాటివని తెలుస్తున్నది. రాకాసి సమాధులు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి ది ‘కెయిర్న్ సర్కిల్’ అంటే సమాధి మీద మ ట్టిదిబ్బ చేసి చుట్టూ బండరాళ్లతో వలయం క డుతారు. రెండవది ‘డోల్మెన్’ అంటే 3నుంచి 4 నిలువు రాళ్లపై బండను బల్లలా అమర్చుతారు.
లోపల శవపేటిక లాంటి గది ఉంటుం ది. మూడోది ‘మెన్హర్’ అంటే ఒక్కటే పెద్ద రాయిని నిలబెట్టడం. ఇది గుర్తుకోసం లేదా ఆచారం కోసం నిర్మిస్తారు. గట్లనర్సింగాపూర్ చెరువులో ఉన్నవి కెయిర్న్ సర్కిల్కు చెందినవి. రాకాసి సమాధులను చెల్లాచెదురు చేసినప్పుడు అందులో ఎరుపు, నల్లరంగు మట్టిపాత్రలు, గొడ్డళ్లు, కత్తులు, మనిషి, గుర్రం, ఆవు ఎముకలు దొరికాయి. గట్లనర్సింగాపూర్లోని చెరువు గట్టున మట్టి తరలింపు క్రమం లో రాకాసి సమాధులు బయటపడ్డాయి. ఈ గ్రామ చెరువులో 60నుంచి 70 వరకు రా కాసి సమాధులున్నాయి. వారసత్వ సంపదకు తార్కాణంగా మిగిలిన ఈ సమాధులను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గూళ్లు తాత, ముత్తాతల సమాధులు. గతాన్ని కాపాడుకుంటేనే వర్తమానానికి అర్థం అని గుర్తుంచుకోవాలని చరిత్రకారుల అభిప్రాయం.