యాదాద్రి, నవంబర్ 25 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్మిక ద్రోహి అని, సీపీఐ మాజీ ఎమ్మెల్యే, ఏఐటీయూసీ మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభ ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పత్తిదారులైన కార్మికులను మోసం చేసి కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నట్లు దుయ్యబట్టారు. రూ.10 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, విద్యుత్ రంగాలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. 84 బొగ్గు బావులకు టెండర్లు ఆహ్వానించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చెందిన కంపెనీకి సైతం టెండర్ను ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభను అసంఘటిత రంగ కార్మికులు, వివిధ విభాగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. బోస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఏఐటీయూసీ మహాసభ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్, కోశాధికారి గోరేటి రాములు, సీపీఐ జిల్లా నాయకులు బాలగోని సత్యనారాయణ, కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, బబ్బూరి శ్రీధర్, పేరబోయిన మహేందర్ పాల్గొన్నారు.