ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల కల నెరవేరబోతున్నది. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,217 మందికి చెందిన 5,875 ఎకరాల భూములకు పట్టాలు సిద్ధమయ్యాయి. నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పోడు పట్టాలను అందించనున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. గత ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల్లోనే అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా అధికారులు పోడు రైతులను గుర్తించి, లబ్ధిదారుల పేరుతోనే పట్టాదారు పాసు పుస్తకాలను సిద్ధం చేశారు. పట్టాల పంపిణీ అనంతరం వెంటనే రైతుబంధు పథకం కూడా వర్తింప జేయనున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా వ్యాప్తంగా పట్టాల పంపిణీ జరుగనున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : గిరిపుత్రులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం అవుతున్నది. 2005 కంటే ముందు వరకు సాగులో ఉన్న రైతులకు పోడు పట్టాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించి విచారణ జరిపి పకడ్బందీగా వ్యవహరించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. అటవీ శాఖ భూములకు అటంకం కలుగకుండా, అర్హత ఉన్న నిజమైన రైతులకు అన్యాయం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పలుమార్లు స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి లబ్ధిదారులను గుర్తించారు. గత నవంబర్ నుంచే దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి, దశల వారీగా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
నల్లగొండ జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో పోడు భూముల సమస్య ఉన్నట్లు వెల్లడైంది. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకూడదన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించారు. దీంతో అర్హులైన వారందరికీ మేలు జరిగింది. నల్లగొండ జిల్లాలో ఫైనల్గా 2,928 మంది రైతులను పోడు లబ్ధిదారులుగా తేల్చారు. వారి ఆధీనంలో 5,577.78 ఎకరాల పోడు భూములు ఉన్నట్లు ఫైనల్ చేశారు. ఈ ప్రకారంగానే పట్టాదారు పాసుపుస్తకాలను సిద్ధం చేశారు. సూర్యాపేట జిల్లాలో పాలకవీడు, మఠంపల్లి మండలాల్లోనే పోడు భూముల సమస్య ఉన్నట్లు వెల్లడి కాగా.. మొత్తం 84 ఎకరాలకు 84 మంది మాత్రమే నిజమైన పోడు రైతులుగా తేలారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 213 ఎకరాలకు గాను 205 మంది రైతులకు పోడు పట్టాలు అందజేసేందుకు రంగం సిద్ధం చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3,217 మంది రైతులకు 5,875 ఎకరాల పోడు భూములకు సంబంధించి పట్టాలు అందనున్నాయి.
నేడు పట్టాల పంపిణీ
అర్హులైన పోడు రైతులకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఉదయం 11గంటలకు, నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు పట్టాలు అందజేయనున్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
రైతు బంధుకు చాన్స్
అర్హుల జాబితా సిద్ధం చేసిన అనంతరం వారి పేరుతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించారు. రైతుల వివరాలతోపాటు భూమి సరిహద్దులు సైతం నిర్ధారించి పట్టాల్లోకి ఎక్కించారు. ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో తప్పులు లేకుండా పాసుపుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకున్నారు. ఈ పట్టాల పంపిణీ పూర్తి కాగానే వెంటనే పోడు రైతులందరికీ రైతుబంధును వర్తింపజేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారందరికీ ఈ వానకాలం సీజన్ నుంచే రైతుబంధు ప్రయోజనం చేకూరనున్నది. ఒక్కో సీజన్లో ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున మొత్తం 2.93 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందనున్నది. రైతు బీమా పథకం సైతం వర్తించనున్నది. గిరిజన తండాల్లో ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూములకు ఎట్టకేలకు పట్టాలు అందనుండడంతో గిరిజనులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. తమ సమస్య పరిష్కారం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందంటూ ప్రశంసలు కరిపిస్తున్నారు.
సెంటు భూమి లేని నాకు పోడు భూమే ఉంది
నాకు సెంటు భూమి కూడా లేదు. చానాళ్లుగా పోడు భూమిని సాగు చేసుకుంటున్నా. అటవీ అధికారులతో తరచూ ఏదో విషయంలో వివాదం నడుస్తూ ఉండేది. మా సర్పంచ్ సాయంతో ఎమ్మెల్యేను కలిశాను. పోడు పట్టా ఇప్పించాలని కోరాను. ఇప్పుడు నేను సాగు చేసే భూమికి పట్టా ఇస్తుండడంతో చాలా సంతోషంగా ఉన్నది. పంటకు పెట్టుబడి సాయం కూడా అందిస్తారని అధికారులు చెప్పారు. సీఎం సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. పోడు పట్టా ఇస్తే బోరు వేసి సంవత్సరానికి రెండు పంటలు పండిస్తా.
– వాంకుణావత్ నందా, గుంతలతండా, చందంపేట మండలం
సీఎం కేసీఆర్ సాయం మరువలేనిది
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అందించే సహాయం మరువలేనిది. రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు. అనుకున్న మాట ప్రకారం రాష్ట్రంలోని గిరిజన రైతులకు పోడు పట్టాలు అందిస్తూ మేలు చేశారు. పట్టాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు సాయం కూడా సీజన్ మొదలు గాకముందే రైతుల అకౌంట్లలో జమ చేయడం సంతోషకరం. ప్రతి సంవత్సరం ఎకరానికి రెండు కార్లకు కలిపి రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
– రమావత్ రఘు, గిరిజన రైతు, ఇందిరానగర్తండా, అడవిదేవులపల్లి మండలం
రూపాయి ఖర్చు లేకుండా పోడు పట్టాలు
30 సంవత్సరాల నుంచి పోడు భూముల కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదు. వేల రూపాయలు ఖర్చయినా భూమి సమస్య పరిష్కారం కాలేదు. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగొచ్చింది. కానీ.. పరిష్కారం దొరకలేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ మా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పోడు భూముల కమిటీలు ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండా, పైసా ఖర్చు లేకుండా పోడు భూముల పట్టాలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– సపావత్ బాలు, పిల్లిగుండ్లతండా, తిరుమలగిరి (సాగర్)మండలం
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
పోడు భూముల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అధికారుల చుట్టు తిరిగినా పరిష్కారం కాలేదు. గతంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు లంచాలకు మరిగి రైతులను పీడించారు. పలుమార్లు ఫారెస్ట్ అధికారులు రైతుల మీద దాడులు చేసి సేద్యం చేస్తున్న భూములను అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మా సమస్య పరిష్కారమవుతుందని సంతోషించాం. చెప్పిన మాట ప్రకారం వెంటనే ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా పోడు భూముల సమస్యలను కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రైతుల పాలిట దేవుడు. నాకు రెండెకరాల వరకు పోడు భూమి పట్టా వస్తుందని సంతోషకరంగా ఉంది.
– ఆంగోతు రమేశ్, తూటిపేటతండా, తిరుమలగిరి (సాగర్)మండలం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..
నేను పుట్టిన కాన్నుంచి ఈ పోడు భూముల సమస్య వారసత్వంగా అలాగే నడుస్తున్నది. పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పాదాలు అరిగిపోయినా సమస్య పరిష్కారం కాలేదు. గతంలో అధికారులు పట్టాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వేలల్లో డబ్బులు ఖర్చు చేయించారు. కానీ.. పట్టా మా పేరున కాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఏ అధికారికీ రూపాయి ఇవ్వకుండా నేరుగా కమిటీ ద్వారా ఎంపిక చేసిన వారికి పట్టాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
– జటావత్ శ్రీను, జాల్తండా, తిరుమలగిరి (సాగర్) మండలం
పాస్ బుక్కులు ఇస్తారని ఎప్పుడూ అనుకోలేదు
నాకు భూమి లేదు. పదిహేనేండ్ల నుంచి పోడు భూమిని సాగు చేస్తున్నా. ఆ భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా పని కాలేదు. ఏ ప్రభుత్వమూ పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. మన సీఎం కేసీఆర్ సార్ మాలాంటి వాళ్లను గుర్తించి పోడు పట్టాలు ఇస్తున్నారు. రైతు బంధు కూడా ఇస్తామంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగుండాలి. కేసీఆర్ సార్ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటాం. మాకు సహాయం చేసిన వారిని మర్చిపోకుండా రుణపడి ఉంటాం.
– కూరాకుల యల్లయ్య, రేకులగడ్డ, చందంపేట మండలం
భయం పోయింది.. భరోసా వచ్చింది
కల్లేపల్లి గ్రామ పరిధి తండా శివారులో 20 ఏండ్లుగా ఎకరంన్నర అటవీ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. భయంభయంగా పంటలను సాగు చేసుకుంటున్నాం. ప్రతిసారీ ఫారెస్టోళ్లు వచ్చి పొలం దున్నితే కేసులు పెడుతామని, భూమిని వదిలిపోవాలని భయపెట్టేవారు. పొలంపైనే ఆధారపడి బతికే మేము భయంతోనే వానల ఆధారంగా పత్తి, కంది తదితర పంటలు పండించేది. ఒకసారి ఫారెస్టు సార్లు వచ్చి దున్నకుండా అరకలను అడ్డుకున్నారు. వారు పెట్టే బాధలు పడలేక పంటలను మధ్యలోనే నిలిపేసినం. సీఎం కేసీఆర్ సారు వచ్చినంక పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పడంతో మాకు ధైర్యం వచ్చింది. అనుకున్నట్టుగానే పోడు భూములకు పట్టాలు ఇస్తుండు. ఇప్పుడు మాకు ఏ బాధా లేదు. హాయిగా బతుకుతాం. రైతుబంధు కూడా ఇస్తామని చెప్పిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– మాలోతు సునీత, కల్లేపల్లి, దామరచర్ల మండలం
గతంలో మా గోడు ఎవరూ పట్టించుకోలేదు
పోడు భూముల పట్టాల గురించి గతంలో ఎంతో మందికి మా గోడు చెప్పుకొన్నాం. పెద్ద పెద్ద సార్లను కలిసి మొరపెట్టుకున్నాం. అయినా ఫలితం లేకపాయె. మా బాధలు అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ సార్ పోడు భూములకు పట్టాలు ఇస్తుండడం సంతోషంగా ఉన్నది. ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం చూపిస్తూ పట్టాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. మా లాంటి రైతులకు ఆయన ఆపద్బాంధవుడు.
– జటావత్ రుక్క, పొగిళ్ల, చందంపేట మండలం
మా బాధను సీఎం కేసీఆర్ సార్ గుర్తించిండు
మా గ్రామం పొగిళ్ల.. చందంపేట మండలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నాకు సెంటు కూడా పట్టా భూమి లేదు. 18 సంవత్సరాల నుంచి పోడు భూమిని సాగు చేస్తున్నా. ప్రతిసారీ అటవీ ఆఫీసర్లు వచ్చి పంటను నాశనం చేశారు. నానా ఇబ్బంది పెట్టారు. ఏం చేయలేక మేము చాలా బాధపడ్డాం. ఒకసారి మా తండా వాళ్లందరం కలిసి కలెక్టర్ సార్ దగ్గరికి పోయినం. అయినా న్యాయం జరుగలేదు. ఇక లాభం లేదని ఎమ్మెల్యే సార్తో చెప్పినం. మా బాధను చూసిన ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్ సార్కు చెప్పి పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత మా ఊళ్లో మీటింగ్ పెట్టి పోడు భూములకు పట్టాలు ఇస్తారని చెప్పారు. మా గ్రామంలో 12 మందికి పోడు పట్టాలతోపాటు భూమికి పైసలు కూడా ఇస్తామన్నారు. ఎంతో సంబురపడ్డాం. నాకు మూడెకరాలకు పట్టా పాసుబుక్కు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ను ఎప్పటికీ మర్చిపోం.
– జటావత్ పకీరా, పొగిళ్ల, చందంపేట మండలం
ఎన్నో ఏండ్ల మా కల నెరవేరింది
నాకు మల్కాపురం గ్రామ పరిధిలో 39గుంటల భూమి ఉన్నది. మా తండ్రి కాలం నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. కొన్నేండ్లుగా ఆ భూమి మాది అంటూ అటవీ శాఖ అధికారులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇచ్చిన హామీకి కట్టుబడి పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారు. ఏండ్లుగా ఎదురుచూస్తున్న మా కల నెరవేరింది. గత పాలకులు మమ్మల్ని ఓటర్లుగా చూసారే తప్ప.. ఏనాడూ మా సమస్యను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
– గుగులోతు సీతారాం, బిల్యానాయక్తండా, తుర్కపల్లి మండలం