యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా… రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆటంకాలు లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మార్గనిర్దేశనంతో మూడు జిల్లాల్లో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదనపు కలెక్టర్లు సారథ్యం వహిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలోనూ ఆందోళన అవసరం లేదని, ఆరబెట్టి అప్పగిస్తే సరిపోతుందని రైతులకు భరోసానిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 330 కోట్ల రూపాయల విలువైన 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన డబ్బును కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు నూరు శాతం కొనుగోళ్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే 6(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లను వేగవంతం చేశారు. ముందే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు దాదాపు మెజార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇదే సమయంలో అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ యంత్రాలు, ఇతర సామగ్రిని సైతం అందజేశారు. మరోవైపు ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లను సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో మొత్తం 249 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుని 231 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మౌలిక వసతులను కల్పించి, గన్నీ బ్యాగులు, ఇతర సామగ్రిని అందించారు. ఇప్పటివరకు మొత్తం 89,755 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12,591 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. దీంట్లో 88,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం విలువ రూ.175.92 కోట్లు కాగా ఇప్పటివరకు 58.23 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. నాలుగైదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులను సైతం అందుబాటులో ఉంచి, కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో…
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 293 కేంద్రాలను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటివరకు ఐకేపీ ద్వారా 81 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 158, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 5 కేంద్రాలు మొత్తం 244 కేంద్రాలను ప్రారంభించారు. వీటిల్లో మెజార్టీ భాగం కొనుగోళ్లను ప్రారంభించారు. ఇప్పటివరకు 220 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,468 మంది రైతుల నుంచి 14,245 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో వెనువెంటనే 12,393 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. వెంటవెంటనే ట్యాబ్ ఎంట్రీ చేస్తూ చెల్లింపులపై దృష్టి సారించారు. ముందస్తుగా అవసరానికి సరిపడా 18.26లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చకచకా కొనుగోళ్లు జరిపేలా ఉమ్మడి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. క్షేత్రస్థాయి పర్యటనలతో కేంద్రాల నిర్వాహకులతో, రైతులతో చర్చిస్తూ ఇబ్బందులపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తూ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రాలకు వచ్చే ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో…
సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు మొత్తం 327 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా 66,130 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10,992 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.129.60కోట్లు కాగా రైతులకు రూ.55.59కోట్లు చెల్లించారు. వెంటవెంటనే చెల్లింపు కోసం జిల్లా పౌరసరఫరాల శాఖ వద్ద మొత్తం రూ.172.05కోట్లను నిల్వ ఉంచారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటికే 61,104మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్కు 75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 53లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చకచకా కొనుగోళ్లు జరుపుతున్నారు.