యాసంగి ఆమ్దానీ 7,498 కోట్లు
ఉమ్మడి జిల్లాలో 26.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
అన్నదాత చేతికి 6,422 కోట్ల ఆదాయం
నూరు శాతం చెల్లింపులు పూర్తి
రైతుబంధు సాయం మరో రూ.1,076 కోట్లు
గోదావరి, కృష్ణా, మూసీ పరవళ్లతో సస్యశ్యామలం
ఉత్సాహంగా వానకాలం సీజన్కు..
పంట మార్పిడితో అధిక లాభాలు
పొందాలని వ్యవసాయ శాఖ సూచన
నల్లగొండ జిల్లాలో యాసంగి
వరి స్వరూపం దిగుబడి 11.17 లక్షల మెట్రిక్ టన్నులు
విలువ రూ.2,189 కోట్లు
రైతు బంధు రూ.448 కోట్లు
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతాంగం 26.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. కేంద్రం కొర్రీలు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టడంతో 8.24లక్షల మంది రైతులకు 6,422 కోట్ల రూపాయలు దక్కాయి. సీజన్ ప్రారంభంలో పంట పెట్టుబడి సాయంగా మరో రూ.1,076 కోట్లు అందాయి. సన్న వడ్లు కొనేందుకు మిలర్లు సైతం పోటీపడడం కలిసివచ్చింది. సమైక్య పాలనలో యాష్టకొచ్చిన ఎవుసం నేడు పండుగలా మారడంతో రైతుల ఇండ్లు కళకళలాడుతున్నాయి. యాసంగి వడ్లు అమ్మితే వచ్చిన డబ్బుతోపాటు వానకాలం రైతు బంధు అందడంతో రైతులు ఉత్సాహంగా పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. కాగా, అవకాశం ఉన్నవారంతా మూస వ్యవసాయానికి స్వస్తి పలికి సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని పంట మార్పిడితో అధిక లాభాలు గడించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
సూర్యాపేట, జూలై 4 (నమస్తే తెలంగాణ) : గత నాలుగేండ్ల మాదిరిగా ఈ సారి కూడా జిల్లాలోని రైతాంగం జేబులు డబ్బులతో గళగళలాడుతున్నాయి. గత యాసంగి సీజన్లోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 29.54 లక్షల మంది రైతుల చేతికి రూ.7,498 కోట్లు అందాయి. 8.24 లక్షల మంది రైతులు 10.74 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా రూ.6,422 కోట్ల విలువ చేసే 26.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం మరో రూ.1,076 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.
రైతు సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
అనాదిగా కరువు కోరల్లో చిక్కుకొని సమస్యలతో సావాసం చేసిన రైతన్నల ముఖం నేడు సంతోషంతో కళకళలాడుతున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. సాగునీటికి ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్, పంట పెట్టుబడికి రైతుబంధు సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. ఇక గ్రామాల్లో రైతులకు లాభదాయక పంటలపై అవగాహన కల్పించడానికి రైతు వేదికలు నిర్మించగా ఏఓలను అన్ని మండలాల్లో నియమించి తోడ్పాటునందిస్తున్నారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పరంగా అన్నీ సమకూరుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తీరాయి. సకాలంలో పంట డబ్బులు చేతికందుతుండడంతో వ్యవసాయం పండుగలా సాగుతున్నది.
9.54 లక్షల మంది రైతులకు రూ.7,623 కోట్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.24 లక్షల మంది రైతులకు గత యాసంగిలో రూ.7,498 కోట్లకుపైనే డబ్బులు అందాయి. వీటిలో రైతులు పండించిన ధాన్యం విలువ రూ.6,422 కోట్లు, సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చినవి రూ.1,076 కోట్లు ఉన్నాయి. దాదాపు 26.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా వీటిలో 80శాతం సన్న ధాన్యం ఉంది. అత్యధిక శాతం ప్రైవేట్లో మద్దతు ధరకు పైనే రైతులు విక్రయించుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చెల్లించగా.. బహిరంగ మార్కెట్లో రైతులు సన్న వడ్లను నాణ్యతను బట్టి రూ.1850 నుంచి రూ.2,100 వరకు విక్రయించారు.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇలా..
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.422 కోట్ల విలువ చేసే 2.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్లు, ప్రైవేట్గా రైస్ మిల్లర్లు రూ.1,838 కోట్ల విలువ చేసే 9.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.640 కోట్ల విలువ చేసే 3.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్రేడర్లు కొనుగోలు చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో రూ.290 కోట్లు విలువ చేసే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా మరో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్రేడర్లు కొనుగోలు చేశారు.
వందశాతం పేమెంట్లు పూర్తి చేశాం
జిల్లాలో వంద శాతం కొనుగోళ్లు కాగా పేమెంట్లు కూడా పూర్తయ్యాయి. జిల్లాలో 2.16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ తదితర కొనుగోలు కేంద్రాల ద్వారా 422 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం డబ్బులను రైతుల అక్కౌంట్లలో జమ చేశాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. రైతులు మూస పద్ధతి వ్యవసాయానికి స్వస్తి చెప్పి పంట మార్పిడితో అధిగ దిగుబడులు సాధించాలి.
– ఎస్.మోహన్రావు, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్