తుర్కపల్లి, జనవరి 20 : విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తలెత్తే ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాదాపురం రైతువేదిక భవనంలో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులతో శుక్రవారం నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, చెక్డ్యాంల నిర్మాణంతో పాటు సకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో భూగర్భజలాలు పెరిగి రైతులు పంటలు అధికంగా వేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.
ట్రాన్స్ఫార్మర్లు కాలిన వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా అదే రోజు ట్రాన్స్ఫార్మర్లు బిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న మాసంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండనున్నందున సమస్యను అధిగమించేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం, యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామాల్లో నూతన సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థలాల సేకరించామని, త్వరలోనే ఆయా గ్రామాల్లో నూతన సబ్స్టేషన్లు మంజూరవుతాయని తెలిపారు.
విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తించడంతో పాటు సమస్యలను వివరించి పరిష్కరించాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. భూగర్భజలాలు పెరగడంతో రైతులు మోటార్ హెచ్పీలు పెంచడంతో ఓవర్ లోడ్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. విద్యుత్ స్తంభాల అవసరం ఉందని అధికారులు ప్రభుత్వ విప్ దృష్టికి తెచ్చారు.
గుండాల మండలంలో మంజూరైన రూ.80లక్షలతో ఓవర్ లోడ్ సమస్య పరిష్కారమైందని పూర్తిస్థాయిలో ఆ సమస్యను పరిష్కరిస్తామని మోత్కూర్ ఏడీఈ బాలు తెలిపారు. ప్రజా దర్బార్లో ఇప్పటి వరకు 13 దరఖాస్తులు రాగా అందులో కొన్ని పరిష్కరించామని మిగిలినవి సైతం త్వరలోనే పరిష్కరిస్తామని డీఈ మల్లికార్జున్ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీఈ డీఎఫ్.మల్లికార్జున్, ఆలేరు, భువనగిరి, మోత్కూర్, బీబీనగర్ ఏడీఈలు సూర్య, ఆనంద్రెడ్డి, బాలు, కృష్ణయ్య, వివిధ మండలాల ఏఈలు సాయిదీప్, ప్రభాకర్రెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్, సురేందర్నాయుడు, వెంకటేశ్, నర్సింహ, భరత్ పాల్గొన్నారు.