నల్లగొండ, ఆగస్టు 21 : 2023-25 సంవత్సర కాలానికి గానూ కొత్త మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ బందోబస్తుతో చేపట్టారు. జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉండగా తొలుత నల్లగొండ సర్కిల్లోని 1వ దుకాణం నుంచి లాటరీ మొదలు పెట్టిన అధికారులు చివరగా నాంపల్లి సర్కిల్లోని 155వ దుకాణంతో ముగించారు. 155 దుకాణాలకు మొత్తంగా 7057 దరఖాస్తులు రాగా దరఖాస్తు దారుల సమక్షంలో లాటరీ తీసి డ్రాలో ఎంపికైన వారితో రిజిస్టర్లో సంతకం చేయించుకున్నారు.
ఈ మొత్తం విధానాన్ని వీడియో తీస్తూ పారదర్శకంగా నిర్వహించారు. పోయిన సారి 4079 దరఖాస్తులు రాగా ఈ సారి అధికంగా వచ్చాయి. డ్రా సమయంలో ఫంక్షన్హాల్ ప్రాంగణం పూర్తయ్యే వరకు ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది. అయితే డ్రాలో దుకాణం పొందిన వారు మంగళవారం వరకు లైసెన్స్ ఫీజులో తొలి విడుత చెల్లిస్తే వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చి ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి సంబంధిత మద్యం దుకాణం కేటాయించనున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ బి. సంతోష్ పాల్గొన్నారు.