– 2024-25 వరకు రూ.5 కోట్ల పనులపై సోషల్ ఆడిట్ నిర్వహణ
చందంపేట, మార్చి 28 : చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో భాగంగా 2024 నుండి 2025 వరకు సుమారు రూ.5 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చందంపేట మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో రూ.5 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై గత వారం రోజుల నుండి ఆయా గ్రామాల్లో సోషల్ ఆడిట్ బృందం ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారని, అట్టి పనులపై చందంపేట మండలంలోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరంలో భాగంగా పనుల వివరాలను ఓపెన్ ఫోరం లో చదివి వినిపించడం జరిగిందన్నారు.
ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు చేసిన పనులు, వారికి చెల్లించిన డబ్బులు సమానంగా ఉన్నాయా లేదా?, అదే విధంగా వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయా లేదా? అనే దానిపై సామాజిక తనిఖీలో భాగంగా ఆయా రికార్డుల ఆధారంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. పలు గ్రామాల్లో పనులు చేయకుండానే బిల్లులు చెల్లించినందున అట్టి డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల్లో జాప్యం లేకుండా ఆయా గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలని పీడీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీవీఓ వేణు గోపాల్ రావు, అంబుడ్స్మెన్ మొహమ్మద్ గౌరీ, క్వాలిటీ కంట్రోల్ ఫసియుద్దీన్, ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ వరలక్ష్మి, పీఆర్ ఏఈ రాజు, శంకర్, రవి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.