వానకాలం సీజన్కు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు జమ కాగా, రెండో రోజు మంగళవారం రెండెకరాల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల్లో కలిపి మొత్తం 8.91 లక్షల మంది రైతులకు రూ.382.87 కోట్లు అందించారు. ఎకరంలోపు నుంచి మొదలుకుని దశల వారీగా పట్టాదారు పాసుపుస్తకం ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఖాతాలో పెట్టుబడి సాయం జమ కానుంది. సీజన్ ఆరంభంలోనే రైతుబంధు డబ్బులు జమ అవుతుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలోనే ఇప్పటివరకు అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకే రైతుబంధు ప్రయోజనం కలుగుతుంది. తొలిరోజు ఉదయం 8 గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లుగా మెసేజ్లు రావడం మొదలైంది. ఎకరంలోపు ఉన్న రైతులందరికీ సోమవారం రైతుబంధు డబ్బులు పడ్డాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి రోజు 3.18 లక్షల మంది రైతులకు 94.97 కోట్ల రూపాయల నగదు జమ అయ్యింది. మంగళవారం రెండెకరాల్లోపు రైతులందరికీ పెట్టుబడి సాయం అందించారు. రెండో రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,73,202 మంది రైతులకు 287.90 కోట్ల రూపాయల సాయం అందింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లాలో రెండో రోజు 2,75,721 మంది రైతులకు రూ.141.16 కోట్ల పెట్టుబడి సాయం అందింది. సూర్యాపేట జిల్లాలో 1,61,177 మంది రైతులకు రూ.82.13 కోట్లు, యాదాద్రి జిల్లాలో 1,36,304 మంది రైతులకు రూ.64.60 కోట్లు జమ అయ్యాయి. బుధవారం మూడెకరాలున్న రైతులకు రైతుబంధు అదనుంది. ఇలా దశల వారీగా పట్టాదారు పాసుపుస్తకం ఉండి వివరాలు అందజేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. 2018 వానకాలం సీజన్లో రైతుబంధు పథకం ప్రారంభం నుంచి ఏటేటా జిల్లా రైతులకు అందుతున్న సాయం పెరుగుతూ వస్తున్నది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్లో రైతుల సంఖ్యతోపాటు వారికి అందే సాయం కూడా పెరిగింది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 1300 కోట్ల రూపాయలు రైతులకు రైతుబంధు ద్వారా సాయం అందనుంది. ఓ వైపు రైతుబంధు డబ్బులు జమ చేస్తూనే వ్యవసాయ శాఖ ద్వారా ఇంకా కొత్త రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండడం విశేషం. ఈ నెల 16వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఈఓలు సూచిస్తున్నారు.
రైతుబంధు నిధుల విడుదలపై హర్షం
సీజన్ ఆరంభంలో రైతుబంధు పెట్టుబడి సాయం అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ బుడిగం నరేశ్, డైరెక్టర్లు గుండపునేని ప్రభాకర్రావు, సోమపంగు పార్వతి, సీఈఓ మంద వెంకటేశ్వర్లు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.