నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతున్నది. ఇక రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్లోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన వంద పడకలకు అప్గ్రేడ్ అవుతున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.32కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆస్పత్రి నకిరేకల్ తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గాల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
– నకిరేకల్, మార్చి 9
నకిరేకల్ పట్టణంలో పాత జాతీయ రహదారి పక్కన 1990 కంటే ముందు ఇప్పుడున్న 30 పడకల ఆస్పత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉండేది. 1998లో అప్పటి ప్రభుత్వం పీహెచ్సీని 30 పడకల కమ్యూనిటీ వైద్యశాలగా మార్చింది. ఓపీ సంఖ్య రోజుకు 350 నుంచి 500 వరకు నమోదవుతుండడంతో దవాఖాన అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ జీఓ 27ను జారీ చేశారు. దీంతో రూ.32కోట్లతో ఆరెకరాల విస్తీర్ణంలో సువిశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. 2021 చివరలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా.. నవంబర్ 25న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పనులను చిరుమర్తి తరచూ పరిశీలిస్తూ నాణ్యత సూచనలు చేస్తున్నారు.
నకిరేకల్, మార్చి 9 : ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. నకిరేకల్ పట్టణంలో రూ.32కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు పెండెం సదానందం, మురారిశెట్టి కృష్ణమూర్తి, గుర్రం గణేశ్, రాచకొండ శ్రవణ్ ఉన్నారు.
నకిరేకల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నిర్ణయించారు. భవనం దిగువ భాగంలోని బ్లాక్-ఏలో డయాలసిస్ మరియు లాండ్రీ విభాగం, బ్లాక్ బీలో ఓపీ సెక్షన్, బ్లాక్ సీలో లేబర్ కాంప్లెక్స్, బ్లాక్ డీలో ఎమర్జెన్సీ విభాగాలుంటాయి. మొదటి అంతస్తులో బ్లాక్ ఏ1లో అడ్మినిస్ట్రేషన్, బ్లడ్ బ్యాంక్, బ్లాక్ బీ1లో రేడియాలజీ సెక్షన్, బ్లాక్ సీ1లో సెంట్రల్ ల్యాబ్, ఓపీ సెక్షన్, బ్లాక్ డీ1లో జనరల్ వార్డులు ఉంటాయి. రెండో అంతస్తులో బ్లాక్ ఏ2లో ఓటీ కాంప్లెక్స్, బ్లాక్ బీ2లో ఎస్ఎన్సీయూ కాంప్లెక్స్, బ్లాక్ సీ2లో జనరల్ వార్డలు, బ్లాక్ డీ2లో పే రూమ్స్, వార్డులు ఉంటాయి.
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిని వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి తెస్తాం. ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని వంద పడకలుగా మార్చాలని మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లా. 2022 జనవరి 21న వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో వంద పడకల ఆస్పత్రిని తీసుకొచ్చా. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే బీఆర్ఎస్ సర్కారు లక్ష్యం.
– నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య