ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్తర రాజగోపురం ముందు గల మాఢ వీధుల్లో తాత్కాలిక గ్రిల్స్ బిగించనున్నారు. ఇందుకోసం సోమవారం ఏర్పాట్లను ఆలయ అధికారులు పరిశీలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నందున ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించనున్నారు. ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సుదర్శన నారసింహ హోమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. నిత్య తిరు కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. తెల్లవారుజామున స్వామి వారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ రంగనాథుడిని పరిణయమాండేందుకు గోదాదేవి చేపట్టిన తిరుప్పావై, పొంగళి నివేదన, పాశుర పఠనం నిర్వహించారు.
పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో విశ్వశాంతి నిమిత్తమైన, లోకకల్యాణార్థం చేపట్టిన పాంచాహ్నిక, ఏకకుండాత్మక సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.36,38,327 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తెలిపారు.
ముక్కోటి(వైకుంఠ) ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దివ్య క్షేత్రంలో ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఉత్తర రాజగోపురం ముందు గల మాఢవీధుల్లో చుట్టూ తాత్కాలిక గ్రిల్స్ బిగించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, ఆలయ ఈఈ దయాకర్రెడ్డి, ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ ఏర్పాట్లను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు వీవీఐపీ, వీఐపీతో సాధారణ భక్తుల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన క్యూలైన్లో అనుమతి ఇవ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి పూర్తైన అనంతరం గ్రిల్స్ను తొలగించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో రెండోసారి స్వామి వారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం వాటిల్లకుండా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.