ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలను వణికుస్తున్న కొవిడ్ మహమ్మారి మరోమారు హెచ్చరికలు జారీ చేస్తున్నది. ప్రస్తుతానికి మన దగ్గర ఆందోళనకర పరిస్థితులు లేకున్నా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గుర్తుచేస్తున్నది. విదేశాల్లో పెరుగుతున్న కేసులు,వైరస్ వ్యాప్తి, మరణాల నేపథ్యంలో ముందస్తుగా అలర్ట్ అయ్యింది. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ జిల్లాల యంత్రాంగం వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టింది. పండుగలు, పార్టీల సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది.
జన సంచారంలోకి వెళ్తే భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నది. ఇప్పటికీ టీకా, బూస్టర్ డోస్ వేసుకోని వారు ఉంటే త్వరగా తీసుకోవాలని చెప్తున్నది. సోమవారం నల్లగొండ, సూర్యాపేట డీఎంహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. కొవిడ్
చికిత్సకు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఆక్సిజన్ నిల్వలు, బెడ్స్ ఎంత మేరకు ఉన్నాయో మంగళవారం ఉదయం 10 గంటల్లోపు వివరాలు అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
– నీలగిరి/నేరేడుచర్ల, డిసెంబర్ 26
కొత్త సంవత్సరం ముందుకొస్తున్న వేళ కరోనా ఆయా దేశాల్లో మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరోసారి వణికిస్తున్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే.. మన దేశంలో దీని ప్రభావం తక్కువేనని వైద్య నిపుణులు
పేర్కొంటున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అలర్ట్ అయ్యింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు అధికార ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
– నీలగిరి/ నేరేడుచర్ల, డిసెంబర్ 26
అప్రమత్తంగా ఉండాలి డీఎంహెచ్ఓ అన్నీమళ్ల కొండల్రావు
నీలగిరి, డిసెంబర్ 26 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైదారోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సోమవారం వైద్యారోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులతో ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ చికిత్స కోసం జిల్లాలో అనుమతులు ఉన్న 39 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు ఎన్ని ఉన్నాయో మంగళవారం ఉదయం 10 గంటల్లోగా నివేదిక అందజేయాలన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులతోపాటు జిల్లాలోని 74 పల్లె దవాఖానలు, 3 బస్తీ దవాఖానలు, 39 పీహెచ్సీలు, ఐదు యూహెచ్సీలు, నాలుగు ఏరియా ఆసుపత్రులతోపాటు జిల్లా మెడికల్ కళాశాల, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సిబ్బంది, అక్కడున్న సౌకర్యాలపై 76 ఫార్మాట్లలో ప్రత్యేకంగా రూపొందించిన వివరాలతో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాలని, ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు మందులు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డెమో రవిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కొవిడ్ నివారణ చర్యలు, చికిత్స గురించి వైద్యారోగ్య శాఖ అధికారి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
2020- 2021లో వేలాది మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయడం, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం, కరోనా నిబంధనలు పాటించడంతో ఈ ఏడాది అంతగా ప్రభావం చూపలేదు. విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న బీఎఫ్-7 వేరియంట్తో మనకు పెద్దగా ముప్పు లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలకు వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతున్నది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలను సిద్ధం చేస్తున్నారు.
కరోనా సాధారణ జలుబులా మారిపోయిందని, ప్రస్తుత పరిస్థితిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా టీకా వేయించుకోవడంతో రోగనిరోధక శక్తి పెరిగిందని చెప్తున్నారు. అయినా.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పండుగలు, పార్టీల సమయాల్లో దూరం పాటించాలని, జనంలోకి వెళ్తే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, బూస్టర్ డోసు టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు.
అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం
కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కొత్త వేరియంట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్ బాధితుల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో 150 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. పది బెడ్లతో ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు. అందులో అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్లో 50 చొప్పున పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు అత్యవసర చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దింపారు.
పిల్లల విషయంలో..
మాస్క్తో రక్షణ..
ఒమిక్రాన్ కన్నా బీఎఫ్-7 బలమైన ఇన్ఫెక్షన్ కలిగి ఉంటుందని, జాగ్రత్తలు తీసుకోకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. అయితే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.
మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. పలుచనివి కాకుండా మేలి రకమైన, కాస్త మందం ఉన్న మాస్కులు ధరించాలి. మాస్కులు అందుబాటులో లేకుంటే కనీసం కర్చీఫ్, చీర కొంగునైనా ముఖానికి అడ్డంగా పెట్టుకోవాలి.
శుభ్రమైన న్యాప్కిన్లు వినియోగించాలి. చేతులతో ఇతరులను తాకకపోవడమే మంచిది. కరచాలనం, ఆలింగనం ఇవ్వకపోవడం ఉత్తమం. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు అడ్డంగా న్యాప్కిన్లు, టిష్యూ పెట్టుకోవాలి. ముక్కు, కండ్ల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిని
చేతులతో నలుపొద్దు.
ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దుకాణం నుంచి పాల ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత కవర్ను శుభ్రంగా కడుగాలి.
భయపడాల్సిన అవసరం లేదు
దేశంలో కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇతర దేశాలతో పోల్చుకుని ఆందోళనకు గురికావద్దు. మన దేశ ప్రజలకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. అపోహాలు పెట్టుకోకుండా మానసికంగా ధైర్యంగా ఉండాలి. మానసిక బలం ముందు కరోనా కూడా ఓడిపోతుంది. అనవసరంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తూ భయాన్ని సృష్టిస్తున్నారు. గతంలోనే భారతదేశానికి బీఎఫ్+7 వేరియంట్ వచ్చి వెళ్లింది. కరోనా టీకాలు దేశంలో చాలా బలంగా ఉన్నాయి.
– డాక్టర్ మాతృ, జనరల్ ఫిజీషియన్