సూర్యాపేట, (నమస్తే తెలంగాణ) /నల్లగొండ, జనవరి 2 : ‘దళిత బంధు పథకాన్ని ఆపండి.. మేం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుకు కూడా నిధులు ఇవ్వొద్దు’ ఇది తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన ఆల్టిమేటం. దాంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్ చేసి గ్రౌండింగ్ చేసే సమయంలో ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో తమకు దళిత బంధు వస్తుందని కొండంత ఆశతో ఉన్న దళిత కుటుంబాల్లో నిరాశ నెలకొన్నది. నల్లగొండ జిల్లాలో దళిత బంధు తొలి విడుతలో 517 మందికి రూ.10లక్షల చొప్పున ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండో విడుతలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున ఇస్తామని ప్రకటించి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలకు ముందే 1058 మంది లబ్ధిదారులు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోగా ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం వారి పేర్లు ఆన్లైన్ చేసింది. నల్లగొండ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. గ్రౌండింగ్ చేసే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ప్రస్తుతం కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఆపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో లబ్ధిదారుల ఆశలు నీరుగారుతున్నాయి.
తొలి విడుతలో ప్రతి యూనిట్ గ్రౌండింగ్
దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం జిల్లాలో తొలి విడుతలో నియోజకవర్గానికి వంద మంది చొప్పున అందజేసింది. రెండో విడుతలో 1100 మంది చొప్పున ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో తొలి విడుతలో 517 మందికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.51.70 కోట్లు అందజేసింది. వాటితో ఆయా కుటుంబాల వారు కిరాణం దుకాణాలు, రవాణ వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, డెయిరీ వంటి వ్యాపారాలు చేపట్టి సంతృప్తికరమైన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.
రూ.33 కోట్లు విడుదల చేసిన బీఆర్ఎస్ సర్కారు
దళిత బంధు రెండో విడుతలో నియోజకవర్గానికి 1100 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల నాటికి 1058 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయి వారి పేర్లు ఆన్లైన్ కూడా అయ్యాయి. దాంతో ప్రభుత్వం తొలి దఫాగా ప్రతి లబ్ధిదారునికి రూ.3లక్షల చొప్పున ఇవ్వాలని తలచింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ చేసిన వారిని బట్టి మొత్తంగా రూ.33 కోట్లు విడుదల చేసింది. గ్రౌండింగ్ చేస్తున్న క్రమంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ పథకానికి బ్రేక్లు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో లబ్ధిదారుల ఆశలు నీరుగారుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 67 మంది అకౌంట్లు ఫ్రీజ్
దళిత బంధు పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలో తొలి విడుతగా నియోజకవర్గానికి వంద చొప్పున సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మూడు నియోజకవర్గాలకు 300 కుటుంబాలకు అందజేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాలో ఉండగా, జిల్లా పరిధిలోని ఆరు మండలాలకు 45 మందికి.. జిల్లాలో మొత్తంగా 345 మందికి రూ.10 లక్షల చొప్పున రూ.34.50 కోట్లు మంజూరయ్యాయి. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో మొత్తం దళిత కుటుంబాలు 2,223 మందికి రూ.222.30 కోట్లు అందజేసింది. వీరంతా గతంలో కూలీలు, గుమస్తాలు, డ్రైవర్లు తదితర పనులు చేసినవారు. ఇప్పుడు దళిత బంధు పథకం ద్వారా యజమానులై ఉపాధి పొందుతూ మరి కొందరికి పని కల్పించే స్థాయికి వచ్చారు.
రెండో విడుతలో గతేడాది నియోజకవర్గానికి 1100 చొప్పున జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు కలిపి 4400 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చేందుకు గత సర్కారు నిర్ణయించింది. ఆ వెంటనే అధికార యంత్రాంగం దరఖాస్తులు స్వీకరించి జాబితాలు కూడా సిద్ధం చేసింది. సూర్యాపేటలో 58 మందిని గుర్తించి తొలి దఫా వారి అకౌంట్లలో రూ.2లక్షల చొప్పున రూ.1.16 కోట్లు జమ అయ్యా యి. తిరుమలగిరి మండలంలో తొమ్మిది మంది లబ్ధిదారులు మృతి చెందడంతో వారి నామినీ అకౌంట్లలో రూ.89.10 లక్షలు జమ చేశారు. అయితే.. ఎన్నికల కారణంగా ఆయా అకౌంట్లు ఫ్రీజ్ కాగా నెల రోజులుగా లబ్ధిదారులు తమ డబ్బు లు ఎప్పుడు విడుదలవుతాయని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల అకౌంట్లలోనే డబ్బులు ఉండగా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని ఫ్రీజింగ్లో ఉంచినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు విడుదల చేయనున్నట్లు సమాచారం.
మా పిల్లల భవిష్యత్ను నిలబెట్టండి
మా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సారు దళితబంధు పెట్టి ఆదుకుంటుండని అంతా సంబురపడ్డాం. ఎంతో మందికి చెక్కులు ఇచ్చిండ్రు.. ట్రాక్టర్లు, కార్లు వచ్చినయ్. కిరాణంతోపాటు అనేక రకాల వ్యాపారాలతో వందలాది మంది దళితుల జీవితాలు మారినయ్. అట్లనే ఎంతో మంచి మనసుతో మా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆలోచన చేసి సూర్యాపేటలో చెప్పులు కుట్టుకునే కుటుంబాలకు దళితబంధు చెక్కులు అందించిండ్రు. ఈ లోపే ఎన్నికలు సమీపించడంతో బ్యాంకు వాళ్లు తరువాత ఇస్తామన్నారు. ఇప్పుడు బ్యాంకుకు పోతే.. పైన అపిండ్రు వాళ్లు విడుదల చేసినప్పుడు ఇస్తామంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తొందరగా దళితబంధు డబ్బులు ఇప్పిస్తే షాపు పెట్టుకుంటే మా పిల్లల భవిష్యత్ నిలబడుతుంది.
– గోగుల భిక్షమయ్య, సూర్యాపేట, దళితబంధు లబ్ధిదారు
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలి
మొదటి విడుత దళిత బంధుతో ఎంతో మంది అనేక రకాల వ్యాపారాలతో సంతోషంగా జీవిస్తున్నరు. అట్లనే విడుతల వారీగా అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరి మా దళితులందరి జీవితాలు మారుతాయనుకున్నం. రెండు నెలల క్రితం ఇక్కడి ఎమ్మెల్యే, అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో చెప్పులు కుట్టుకునే 18 కుటుంబాలను గుర్తించి దళిత బంధు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో సూర్యాపేటకు వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందరికీ చెక్కులు అందించిండ్రు. కానీ.. ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. ఎన్నికలు అయిపోయాక వస్తయనుకున్నం. ఇప్పుడు వెళ్తే పై నుంచి సార్లు చెప్పినంకనే ఇస్తామంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని డబ్బులు ఇప్పించి మా జీవితాల్లో వెలుగులు నింపాలి.
– గంట లింగయ్య, సూర్యాపేట
నిలిపివేయమని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ నియోజకవర్గంలో ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి అప్పుడే నిధులు విడుదల చేసింది. ఎన్నికలు రావడంతో అప్పట్లో ఆగిపోగా ఇప్పుడు ఇవ్వాలని కలెక్టర్ను కలిశాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దళిత బంధు పథకాన్ని నిలిపివేయమని ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టర్ చెప్పారు. ఒక ప్రభుత్వం ఇచ్చినదాన్ని మరో ప్రభుత్వం వచ్చాక అమలు చేయాలి. కానీ.. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ నిధులు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. ఈ నెల 8న నిరంతర దీక్ష చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
– పాలడుగు నాగార్జున, దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్, నల్లగొండ