రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో పయనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన స్ఫూర్తిని చాటేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తికాగా.. విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నియోజకవర్గానికి 300చొప్పున ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 3600 మందిని ఇందులో భాగస్వాములను చేయాలని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు సన్నాహకాలు మొదలు పెట్టాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తరలి వెళ్లాల్సిన వారి జాబితాను రూపొందిస్తున్నారు. ఆ మేరకు రవాణా, భోజనాలు, ఇతర సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : దళితుల సంక్షేమం, ఆర్థ్ధికాభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దేశానికే ఆదర్శంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో అనాదిగా వివక్షకు గురవుతూ అట్టడుగు వర్గంగా మిగిలిపోయిన దళితుల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపుతున్నది.
ఉమ్మడి జిల్లా పరిధిలో మొదట వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రూ.349.80 కోట్లతో 3498 మందికి యూనిట్లు అందించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 యూనిట్ల చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 6 వేల మందికి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
పథకాన్ని దశలవారీగా అందరికీ వర్తింపజేయనున్నారు. ఇదే సమయంలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని సమాజంలో మరింత విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రాష్ట్ర నూతన సచివాలయానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టారు. దాంతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున భారీ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 14న తేదీన విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తోంది.
దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు
విగ్రహావిష్కరణ సభలో పాల్గొనే వారికి సంబంధించి మండలాల వారీగా జాబితా సిద్ధం చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మేధావులు, వివిధ రంగాల్లోని ప్రముఖులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరందరికీ సమాచారం అందించి ఈ నెల 14న మండల కేంద్రానికి వచ్చేలా చూడనున్నారు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్కు తీసుకెళ్లనున్నారు.
ఇలా తరలివెళ్లే వారికి ఉదయం టిఫిన్తో పాటు భోజన వసతి కూడా కల్పించనున్నారు. ప్రతి బస్సులో ఓ పోలీస్ అధికారితో పాటు మరో ప్రభుత్వ అధికారి కూడా ఉండనున్నారు. మండల కేంద్రం నుంచి బయల్దేరి తిరిగి సాయంత్రం వచ్చే వరకు వీరే బాధ్యత తీసుకోనున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా స్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. మూడు రోజుల క్రితం దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్షరెన్స్లో తగిన ఆదేశాలు ఇచ్చారు.
ఇందులో పాల్గొనే వారంతా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కచ్చితంగా సభా స్థలానికి చేరుకునేలా చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీరికి కేటాయించిన స్థలాల్లో కూర్చోబెట్టేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రకారంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఏర్పాట్లల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ఉమ్మడి జిల్లా నుంచి 3600 మంది
అంబేద్కర్ జయంతి సందర్భంగా జరుగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల వారిని భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రముఖులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మంది చొప్పున పాల్గొనేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది. నెక్లస్ రోడ్డులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అధికారికంగా తరలివచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రతి మండలం నుంచి 50 మంది చొప్పున నియోజకవర్గం నుంచి 300 మందికి మించకుండా తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమచారం ప్రకారం ప్రతి మండల కేంద్రం నుంచి ఒక బస్సును ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బస్సులో 50 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 3600 మంది పాల్గొననున్నారు. వీరి కోసం జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు.